Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:09 AM
ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య వలన శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు రెండు గంటలపాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ తరువాత విమానం ఆలస్యంగా గోవాకు బయలుదేరింది

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో రెండున్నర గంటలు ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం 7.05 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 225 మంది ప్రయాణికులతో గోవా వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చి తిరిగి అదే విమానం గోవా వెళ్లాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో గోవా నుంచి రావాల్సిన ఆ విమానం రెండున్నర గంటలు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఎయిర్లైన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎయిర్లైన్స్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టకేలకు ఉదయం 8 గంటలకు గోవా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానం ప్రయాణికులతో తిరిగి ఉదయం 9.30 గంటలకు గోవా బయలుదేరి వెళ్లింది.