Cheating Case: పోలీసుల కస్టడీకి శ్రవణ్రావు
ABN , Publish Date - May 23 , 2025 | 02:49 PM
Cheating Case: చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావు సీసీఎస్ పోలీసులు ఒకరోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి శ్రవణ్ రావు స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు.

హైదరాబాద్, మే 23: చీటింగ్ కేసులో శ్రవణ్ రావును (Sravan Rao) పోలీసులు కస్టడీలోకి (Police Custody) తీసుకుని విచారిస్తున్నారు. అఖండ సంస్థను మోసం చేసిన వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. రూ.6.58 కోట్లపై ప్రశ్నించడంతో పాటు బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. చీటింగ్ కేసులో శ్రవణ్ రావును నాంపల్లి కోర్టు ఒక్కరోజు పాటు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో చంచల్ గూడ జైలులో రిమాండ్లో ఉన్న శ్రవణ్ రావును ఈరోజు (శుక్రవారం) సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న శ్రవణ్ రావుపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. అఖండ సంస్థకు కోట్లలో నష్టం కలిగించడంతో పాటు మోసానికి పాల్పడ్డారంటూ బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎకోర్ ఇండస్ట్రీ నుంచి ముడి ఇనుమును కొనుగోలు చేస్తే టన్నుకు భారీగా లాభం ఉంటుందంటూ అఖండ ఎంటర్ ప్రైసెస్ సంస్థ నుంచి రూ. రూ.6.58 కోట్లు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు శ్రవణ్ రావు. అయితే డబ్బులు తీసుకున్నాక కట్టకుండా అమెరికాకు పారిపోయాడంటూ అఖండ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రవణ్రావుపై పోలీసులు కేసు నమోదు చేసి ఈనెల 13న అరెస్ట్ చేశారు. ఆపై జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసులో శ్రవణ్ రావుకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు, ఆయన కంపెనీకి సంబంధించిన ఆర్థిక పరమైన లావాదేవీలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇదే కేసులో శ్రవణ్ రావుతో పాటు ఆయన భార్య స్వాతి రావును కూడా చేర్చారు. ఈ కేసులో శ్రవణ్ రావు భార్య ఏ4 నిందితురాలిగా ఉన్నారు.
ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు నిందితుడిని ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడిని ఒక్క రోజు పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నేడు శ్రవణ్రావును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటల వరకు శ్రవణ్ రావును విచారణ జరుపనున్నారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు తరలించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
సీఎం అవినీతి బాగోతం బయటపడింది: కేటీఆర్
విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..
Read Latest Telangana News And Telugu News