Raja Singh: కరీంనగర్ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - May 30 , 2025 | 10:47 AM
Raja Singh: సొంత పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై యుద్ధం మొదలైందంటూ ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు.

హైదరాబాద్, మే 30: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasingh) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీ నేతలను ఉద్దేశించిన మాట్లాడిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్లో తన అభిప్రాయం చెప్పినందుకు కరీంనగర్ నుంచి తన మీద యుద్ధం స్టార్ట్ అయిందని పరోక్షంగా బండి సంజయ్ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. గతంలో కిషన్ రెడ్డికి రాజాసింగ్కు మధ్య బండి సయోధ్య కుదిర్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం కమల దళంలో మరోసారి చర్చకు దారి తీసింది.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. తాను పార్టీలో ఉన్నంత కాలం అది కుదరదన్న ఉద్దేశంతోనే తనను కేసీఆర్కు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆరే తన నాయకుడుని, ఇతరుల నాయకత్వంలో తాను పనిచేయనంటూ కవిత చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
ఇక కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమంటూ కవిత చెప్పిన మాటలు నిజమేనేమో అని అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరకితే తమ వాళ్లు ఎప్పుడో బీఆర్ఎస్తో కలిసిపోయేవారని అన్నారు. ప్రతీ ఎన్నికల్లో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని అందువల్ల పార్టీ చాలా నష్టపోయిందంటూ రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
అయితే బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ తెలంగాణ బీజేపీ నేతల తీరు మారడం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ నేతలే పట్టించుకోని పరిస్థితి. పార్టీకి నష్టం కలిగించేలా నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా జూన్ 2న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా దుబ్బాక ఎంపీ రఘునందన్ కూడా జూన్ 2న ఎమ్మెల్సీ కవిత కొత్తపార్టీ పెట్టబోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతల కామెంట్స్ సొంత పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి. నేతల మధ్య ఏదైనా అభిప్రాయాలు ఉంటే మీడియాకు చెప్పే ముందు రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, ఇవి చేయడకుండా ఎవరి తోచిన విధంగా వారు మీడియా ముందుకు వెళ్లి మాట్లాడితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ పార్టీ నేతలకు రెండు రోజుల క్రితం కిషన్ రెడ్డి చెప్పారు. అయితే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదా లేక పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అనే దానిపై పెద్ద ఎత్తున బీజేపీలో చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
బాత్రూమ్లో నీళ్లు లేవు.. మండిపడ్డ నటి
ఈ ఔషధాలను పరిమితికి మించి వాడుతున్నారా.. కిడ్నీలు రిస్క్లో పడ్డట్టే
Read Latest Telangana News And Telugu News