Prabhakar Rao SIT Inquiry: మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:23 AM
Prabhakar Rao SIT Inquiry: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

హైదరాబాద్, జూన్ 14: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Former SIB chief Prabhakar Rao) సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనే కేసులో ఇప్పటికే రెండుసార్లు ఆయనను సిట్ సుదీర్ఘంగా విచారించింది. ఈ క్రమంలో మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసులు పంపగా.. ఈరోజు (శనివారం) జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు ప్రభాకర్ రావు చేరుకున్నారు. అనంతరం సిట్ విచారణ మొదలైంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు అత్యంత కీలకంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే పనిచేశామంటూ కిందస్థాయి సిబ్బంది ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతి రావు, భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో స్పష్టం చేశారు. గతంలో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును విచారించగా.. ఆయన పోలీసులకు సహకరించని పరిస్థితి. పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు ధాటవేసే ధోరణిలో వ్యవహరించినట్లు సమాచారం. గతంలో జరిగిన అంశాలు తనకు గుర్తు లేదంటూ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు విచారించిన నిందితుల స్టేట్మెంట్ను ముందు ఉంచి ప్రభాకర్రావును విచారిస్తున్నారు సిట్ అధికారులు.
సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ తరువాత నాలుగు గంటల వ్యవధిలోనే ఎస్ఐబీ కార్యాలయంలోని హార్డ్ డిస్క్లు మాయం అయ్యాయి. ప్రణీత్ రావు వీటన్నింటినీ కూడా ధ్వంసం చేసి మూసీలో పడేశారు. ఎవరి ఆదేశాల మేరకు ధ్వంసం చేశారని గతంలో ప్రణీత్ రావును విచారించగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇదంతా చేశానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని ప్రభాకర్ రావు చెప్పుకొస్తున్నారు. ఆదేశాలు ఇస్తే అందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను చూపించాలంటూ పోలీసులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక ప్రశ్నలు సంధించగా.. ఆయన మౌనం వహించినట్లు సమాచారం.
ఈ క్రమంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నలుగురు నిందితులను ఒకచోట చేర్చి విచారించి ప్రభాకర్ రావు నుంచి సమాధానాలు రాబట్టాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతిరావులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. తాడపత్రిలో ఏం జరుగుతోంది
Read latest Telangana News And Telugu News