Share News

Prabhakar Rao SIT investigation: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్ రావు విచారణ ప్రారంభం

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:49 AM

Prabhakar Rao SIT investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు విచారణ ప్రారంభమైంది. ప్రభాకర్‌రావును జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు.

Prabhakar Rao SIT investigation: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్ రావు విచారణ ప్రారంభం
Prabhakar Rao SIT investigation

హైదరాబాద్, జూన్ 9: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (SIB Former Chief Prabhakar Rao) సిట్ విచారణకు హాజరయ్యారు. ఈరోజు (సోమవారం) ఉదయం ప్రభాకర్‌రావు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభమైంది. ప్రభాకర్‌రావును జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాట్లు చేశారు. ఆయన స్టేట్‌మెంట్‌ను దర్యాప్తు అధికారులు రికార్డు చేయనున్నారు.


ప్రభాకర్‌రావుపై ఎలాంటి ప్రశ్నలు సంధించాలి, ఎలాంటి అంశాలపై సమాధానాలు రాబట్టాలనే దానిపై దర్యాప్తు బృందం సన్నద్ధమైంది. విచారణలో ప్రభాకర్‌రావు చెప్పే స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని మరికొంత మంది రాజకీయ ప్రముఖులకు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసు అధికారులు.. ఎస్‌ఐబీ చీఫ్ ఆదేశాల మేరకే ముందుకు వెళ్లామని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో జర్నలిస్టులు, రాజకీయ నేతలు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఆ అంశాలపై ప్రభాకర్‌ రావును సుదీర్ఘంగా విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.


ఈ కేసులో ప్రణీత్ రావు, రాధాకిషన్‌ రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్‌మెంట్ చాలా కీలకంగా మారింది. ప్రభాకర్ రావు ఆదేశాలతో తాము పనిచేశామని ముగ్గురు స్టేట్‌మెంట్ ఇచ్చారు. వారి స్టేట్‌మెంట్లను ఎదురుగా పెట్టి ప్రభాకర్‌రావును జూబ్లీహిల్స్ ఏసీపీ విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రణీత్ రావు దాదాపు 50 హార్ట్‌ డిస్క్‌లను ధ్వంసం చేశారు. అయితే ప్రభాకర్ రావు ఆదేశాలతోనే వాటిని ధ్వంసం చేసినట్లు ప్రణీత్‌ రావు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎస్‌ఐబీకి చెందిన కీలకమైన డాటాను ధ్వంసం చేశారు. వాటికి సంబంధించి కూడా ప్రభాకర్‌ రావును విచారించనున్నట్లు తెలుస్తోంది. అప్పటి పీసీసీ చీఫ్‌, ప్రస్తుతం సీఎంగా ఉన్న ఫోన్లను కూడా గతంలో ట్యాప్ చేశారు. సంఘ విద్రోహ శక్తులు, నక్సల్స్‌ కోసమే ఎస్‌ఐబీ పనిచేయాలి తప్ప ఇలా రాజకీయ నేతల ఫోన్లను ట్యాపింగ్ అనైతికంగా జరగిందని గతంలోనే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబందించి ఇప్పటికే న్యాయస్థానంలో జూబ్లీహిల్స్ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నేటి విచారణకు ప్రభాకర్ రావు స్పందిస్తారా లేదా అనేది చూడాలి.


ఇవి కూడా చదవండి

యోగాకు పెరుగుతున్న ఆదరణ: కలెక్టర్ లక్ష్మీ శా

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 01:57 PM