Share News

Faith Bwalya: మిస్‌ వరల్డ్‌ జాంబియా ఫెయిత్‌ బ్వాల్యా ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - May 26 , 2025 | 02:07 PM

మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన యువతులను చూస్తే దేవలోకం నుంచి ఇప్పుడే భువికి దిగి వచ్చిన దేవతల్లా కనిపిస్తున్నారు. అయితే నిజానికి వారి దారి మెుత్తం ముళ్లబాట. ఒక్కొక్కరి జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టకు మానరు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని విశ్వవేదికపై పోటీ పడే వారి పోరాట స్ఫూర్తి చూస్తే సెల్యూట్ చేయాల్సిందే.

Faith Bwalya: మిస్‌ వరల్డ్‌ జాంబియా ఫెయిత్‌ బ్వాల్యా ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు..
Miss World Zambia Faith Bwalya

హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్-2025 పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 7 నుంచి 31 వరకూ జరిగే మిస్ వరల్డ్ 72వ ఎడిషన్‌ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వారికి తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా.. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా పోటీలను నిర్వహిస్తోంది. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా వారితో వివిధ కార్యక్రమాలు చేస్తోంది. మరోవైపు పోటీలో పాల్గొని మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకునేందుకు ముద్దుగుమ్మలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


పోటీలకు హాజరైన యువతులను చూస్తే దేవలోకం నుంచి ఇప్పుడే భువికి దిగి వచ్చిన దేవతల్లా కనిపిస్తున్నారు. అయితే నిజానికి వారి దారి మెుత్తం ముళ్లబాట. ఒక్కొక్కరి జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టకు మానరు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని విశ్వవేదికపై పోటీ పడే వారి పోరాట స్ఫూర్తి చూస్తే సెల్యూట్ చేయక మానరు. ముఖ్యంగా మిస్‌ వరల్డ్‌ జాంబియా ఫెయిత్‌ బ్వాల్యా జీవితం గురించి చూస్తే షాక్ అవ్వడం ఖాయం. 16 ఏళ్లకే అత్యాచారానికి గురై.. హక్కుల కోసం పోరాడుతున్న ఆమె జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఆదివారం జరిగిన అందాల పోటీల్లో ముద్దుగుమ్మలు తమ జీవిత విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మిస్‌ వరల్డ్‌ జాంబియా ఫెయిత్‌ బ్వాల్యా సైతం తన గురించి చెప్పుకొచ్చారు. 16 ఏళ్లకే తాను అత్యాచారానికి గురయ్యానంటూ చెప్పడంతో అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. ఈ సందర్భంగా బ్వాల్యా మాట్లాడుతూ.. 'మనం చిన్నతనంలో ఎలా ఉన్నామన్నది కాదు.. యుక్త వయసుకు వచ్చాక మన ఆశలు, ఆశయాలను చేరుకోగలిగామా..? మనం కోరుకున్న జీవితాన్ని పొందగలిగామా..? అన్నది ప్రశ్నగానే మిగిలిపోతుంది. మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో. నేను పుట్టి పెరిగిందంతా జాంబియాలోనే. యుక్తవయసుకు వచ్చాకే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసింది. నాకు 16 ఏళ్లు వచ్చేసరికి నాలోని స్వేచ్ఛను లాగేసుకున్నారు.


పదహారేళ్లకే పెళ్లి చేశారు. పదహారేళ్లకే మానభంగానికీ గురయ్యాను. ఇన్నేళ్లుగా ఆ క్షోభను భరిస్తూనే గడిపేశాను. ఎందుకంటే, నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడే శక్తి నాకు లేదు. ఈ రోజు ఆ శక్తిని పొందగలిగాను. అందుకే ఎనిమిదేళ్ల తర్వాత ఈ సంఘటన గురించి చెబుతున్నాను. ఎందుకంటే, నేను జాంబియాలో అభాగ్యుల ప్రతిబింబంగా భావిస్తున్నాను. వారి కలలు కూడా ఛిద్రమయ్యాయి. వారిని కలల తీరాలకు చేర్చాలన్నదే నా ప్రయత్నం. మన నుంచి ఏదైనా తీసుకోగలరమో కానీ, విద్య, నైపుణ్యాలను మాత్రం తీసుకువెళ్లలేరు. చాలా మంది చెబుతుంటారు, ఈ ప్రపంచాన్ని ఎవరూ మార్చలేరని. నిజమే, మనం పరిపూర్ణత కోసం వెంపర్లాడుతున్నాం కానీ, మనం చెప్పాల్సిన కథనం మార్చాల్సి ఉంది. విద్యతోనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం మనకు శక్తినిస్తుంది. ఆ శక్తే మనం కోరుకున్న సమాజానికి నాంది పలుకుతుంది. దాని కోసమే నా తపనంతా' అంటూ చెప్పుకొచ్చారు.


వీడియో ఇక్కడ చూడండి..


ఈ వార్తలు కూడా చదవండి:

Israel Gaza Airstrike: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 40 మంది మృతి

Road Accident: రోడ్డుప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Updated Date - May 26 , 2025 | 02:28 PM