Share News

Drugs Case: కూకట్‌పల్లి డ్రగ్స్‌ కేసు.. కానిస్టేబుల్ కోసం ముమ్మరంగా గాలింపు

ABN , Publish Date - Jun 04 , 2025 | 10:55 AM

Drugs Case: కూకట్‌పల్లి డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు కానిస్టేబుల్‌ గుణశేఖర్‌ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. గుణశేఖర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Drugs Case: కూకట్‌పల్లి డ్రగ్స్‌ కేసు.. కానిస్టేబుల్ కోసం ముమ్మరంగా గాలింపు
Hyderabad Drugs Case

హైదరాబాద్, జూన్ 4: నగరంలోని కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో (Drugs Case) దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న కానిస్టేబుల్ గుణశేఖర్‌‌తో పాటు మిగిలిన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుణశేఖర్ డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. గుణశేఖర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈజీ మని కోసం డ్రగ్స్ దందాలో దిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆరేళ్ల క్రితం కానిస్టేబుల్ గుణశేఖర్‌తో సురేంద్రకు పరిచయం ఏర్పడినట్లు గుర్తించారు. ఇటీవల కావలికి చెందిన వేణు అనే తన స్నేహితుడికి మెర్సీ మార్గరెట్ వద్ద రూ.9.20 లక్షలు అప్పు ఇప్పించాడు సురేంద్ర.


వేణు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సురేంద్రపై మెర్సీ ఒత్తిడి తెచ్చింది. దీంతో కానిస్టేబుల్ గుణశేఖర్‌ను సురేంద్ర సహాయం అడిగాడు. తన వద్ద ఉన్న ఎపిడ్రిన్ డ్రగ్ విక్రయిస్తే కమిషన్ ఇస్తానని, అప్పుల బాధ నుంచి బయటపడవచ్చని కానిస్టేబుల్ గుణశేఖర్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో డబ్బు వస్తుందనే ఆశతో డ్రగ్స్ విక్రయించేందుకు ఒప్పుకొన్నాడు. హరిబాబు అనే వ్యక్తి సహాయంతో డ్రగ్స్ విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా బెంగళూరులో అప్పన్నకు ముందుగా 500 గ్రాముల ఎపిడ్రిన్ డ్రగ్‌ను సురేంద్ర విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 20 రోజుల క్రితం అప్పన్నకు మదనపల్లి వద్ద సుమారు 500 గ్రాముల ఎపిడ్రిన్ డ్రగ్‌ను అందజేశాడు.


అనంతరం హైదరాబాద్‌లో తమ వద్ద ఉన్న మిగిలిన డ్రగ్‌ను విక్రయించేందుకు నిందితులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు ఐదు మందితో కూడిన ముఠా వచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని అక్కడే ఉన్నారు. వీరంతా కలిసి గత ఆదివారం (జూన్ 1) డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించాలని.. ఆ రోజు పోలీసుల నిఘా ఉండదని భావించారు. అయితే కూకట్‌పల్లి పోలీసులతో పాటు బాల్‌నగర్‌ పోలీసులు వీరిపై నిఘా ఉంచి.. డ్రగ్స్ విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 820 గ్రాముల ఎపిడ్రిన్ మిక్స్‌డ్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ కేసులో కానిస్టేబుల్ గుణశేఖర్ కీలకంగా ఉన్నాడు.


గుణశేఖర్‌ను అరెస్ట్ చేస్తే కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గుణశేఖర్‌కు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ప్రధానంగా నిగ్గు తేలే అవకాశం ఉంది. పట్టుబడిన డ్రగ్స్‌తో పాటు గుణశేఖర్‌ వద్ద ఇంకా డ్రగ్స్ ఉందా అనే అంశాలపై పోలీసుల విచారణలో బయటపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ గుణశేఖర్‌తో పాటు బెంగళూరుకు చెందిన అప్పన్న కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒక బృందం బెంగళూరుకు వెళ్లగా, మరొక బృందం తిరుపతిలో గుణశేఖర్‌ కోసం గాలిస్తోంది.


ఇవి కూడా చదవండి

ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు: సీఎం చంద్రబాబు

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 11:05 AM