KTR: హిల్ట్పాలసీపై పోరాటం కొనసాగిస్తాం.. ఇది ఆరంభం మాత్రమే.. సర్కార్కు కేటీఆర్ హెచ్చరికలు
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:46 PM
ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించిందని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రజల ఆస్తిని సరైన పద్ధతిలో వినియోగించాలని సూచించారు.
హైదరాబాద్, డిసెంబర్ 4: హిల్ట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా జీడిమెట్ల పారిశ్రామికవాడలో కేటీఆర్ ఈరోజు (గురువారం) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు పరిశ్రమలకు రాయతీపై విలువైన భూములు కేటాయించారని.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భూముల ధరలు ఇపుడు భారీగా పెరిగాయని తెలిపారు. జీడిమెట్ల ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో రూ.75 వేల కోట్ల వరకు విలువ చేసే భూములు ఉన్నాయని మాజీ మంత్రి అన్నారు. రెండేళ్లలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఇండ్లు కట్టవచ్చని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టవచ్చన్నారు. కానీ, ఇవేవీ చేయమంటున్నారని.. కనీసం శ్మశాన వాటికలకు కూడా స్థలం లేదన్నారు. కాలుష్యాన్ని నివారించాలని అనడంలో ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ ధరలో 30 శాతం ఇచ్చి ఏమైనా చేసుకోవచ్చని ప్రభుత్వం అంటోందన్నారు. ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు. ప్రజల ఆస్తిని సరైన పద్ధతిలో వినియోగించాలని సూచించారు. ప్రజల కోసం వినియోగించాలని, గ్రీన్ ఇండస్ట్రీస్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఆషాఢ సేల్ లాంటి ఆఫర్ను చూసి పారిశ్రామిక వేత్తలు మోసపోవద్దని తెలిపారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వెనక్కు తీసుకుంటామన్నారు. చట్టం తీసుకొచ్చి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగం కావద్దని పారిశ్రామికవేత్తలను కోరారు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ, హిల్ట్ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరపణలు గుప్పించారు. కోకాపేటలో వందల కోట్లు... జీడిమెట్ల ప్రాంతంలో కోటి రూపాయలు అంటే ఎలా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి... అవినీతి అనకొండ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి మూటలు పంపేందుకు, దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారన్నారని... బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్లో అందరికీ అవగాహన కల్పిస్తామని.. సమావేశాలు పెడతామని, న్యాయస్థానాల్లో పోరాడతామని స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, అఖిలపక్ష సమావేశాలు పెడతామన్నారు. నిజ నిర్ధారణతో పాటు ధర నిర్ధారణ చేస్తామని కేటీఆర్ తెలిపారు. గ్రిడ్ పాలసీలో ఐటీ పరిశ్రమలు పెట్టమని చెప్పామని... దాన్ని ఎలా తప్పు పడతారని నిలదీశారు.
ఎవరి ప్రయోజనాల కోసం ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భూములను ప్రజలు, కార్మికుల కోసం ఉపయోగించుకోవాలన్నారు. హైదరాబాద్లో లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారని... వారికి ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేరిట పేదల గుడిసెలు తొలగిస్తున్నారని... పెద్దవాళ్ళకు మాత్రం ధారాదత్తం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. హిల్ట్ పాలసీ బయటకు ఎలా వచ్చిందని ప్రభుత్వం గింగిరాలు తిరుగుతోందన్నారు. దోపిడీ జరుగుతుంటే ఎవరో తెలంగాణ బిడ్డ సమాచారం ఇచ్చారని తెలిపారు. హిల్ట్ భూముల విషయంలో ఇది ఆరంభం మాత్రమే... పోరాటం ఇంకా కొనసాగిస్తామని, కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్
సెంటిమెంట్ రగిల్చి లబ్ది పొందే యత్నం.. బీఆర్ఎస్పై పీసీసీ చీఫ్ ఫైర్
Read Latest Telangana News And Telugu News