Share News

KTR Reaction: పల్లెల నుంచే కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్: కేటీఆర్

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:22 PM

కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచక పర్వాన్ని ఎదుర్కొన్నారని పార్టీ శ్రేణులకు కేటీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా గులాబీ సైనికులందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు.

KTR Reaction: పల్లెల నుంచే కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్: కేటీఆర్
BRS Working President KTR

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీ దాటకపోవడం.. ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శమన్నారు. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగిందని తెలిపారు. కానీ రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా రుజువైందని స్పష్టం చేశారు. తొలి విడత పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా.. బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు హోరాహోరీగా పోరాడి.. సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచారని పేర్కొన్నారు.


కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచక పర్వాన్ని ఎదుర్కొన్నారంటూ వారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా గులాబీ సైనికులందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రే జిల్లాల్లో పర్యటించి ప్రచారం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తొలిదశ పంచాయతీ ఫలితాల ద్వారా స్పష్టమైందన్నారు.


రానున్న మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. పల్లెల్లో పైసా అభివృద్ధి పని జరగదని గ్రామస్తులు ఒక నిర్ధారణకు వచ్చేశారని చెప్పారు. అందువల్లే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని వివరించారు. సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం.. పలు ప్రాంతాల్లో 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.


రెండేళ్లు గడిచినా ఆరు గ్యారెంటీల పేరిట.. పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి, తులం బంగారం హామీ పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రాంత ప్రజలు ఇంకా మరిచిపోలేదని తెలిపారు. ఈ విషయాన్ని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయన్నారు. యూరియా బస్తాల కోసం నెలల తరబడి పడిన అగచాట్లు, బోనస్ పేరిట చేసిన బోగస్ హామీ, చివరికి పండించిన పంటను అమ్ముకో లేక పడ్డ కష్టాలను అన్నదాతలు గుర్తు పెట్టుకున్నారని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు.


పదేళ్లపాటు ప్రగతిపథంలో సాగిన పల్లెల్లో.. గత రెండేళ్లుగా పాలన పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాడి తప్పిన పారిశుధ్యం, చివరికి ట్రాక్టర్లలో డిజిల్ పోయలేని దుస్థితి పల్లె ప్రజలను ఆలోచింప జేసినట్టు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ కాగ్నిజెంట్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు: సీఈవో రవి కుమార్

అఖండ 2 చిత్ర నిర్మాతలకు ఊరట..

For More TG News And Telugu News

Updated Date - Dec 12 , 2025 | 06:05 PM