Drugs In Pubs: కోకాపేటలోని పబ్లో దాడులు.. ఇద్దరికి గంజాయి పాజిటివ్
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:20 PM
Drugs In Pubs: కోకాపేట్లోని పబ్లో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు ఎస్వోటీ పోలీసులు. డ్రగ్స్, గంజాయి వాడుతున్నట్లు సమాచారంతో ఎస్ఓటీ, నార్సింగి పోలీసులు సంయుక్తంగా పబ్లలో దాడులు నిర్వహించారు.

హైదరాబాద్, జూన్ 16: రాష్ట్రంలోని పలు పబ్లపై ఎస్ఓటీ పోలీసులు (SOT Police) వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు మెరుపుదాడులు చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి వాడుతున్నారన్న సమాచారంతో పలు పబ్లో ఎస్వోటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. తాజాగా కోకాపేట్లోని (Kokapet) పబ్లో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు ఎస్వోటీ పోలీసులు. డ్రగ్స్, గంజాయి వాడుతున్నట్లు సమాచారంతో ఎస్ఓటీ, నార్సింగి పోలీసులు సంయుక్తంగా పబ్లలో దాడులు నిర్వహించారు. కోకాపేటలోని రాబిట్ హోల్, మై క్యూప్స్, గండిపేటలోని టస్కా పబ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇద్దరికి గంజాయి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో నార్సింగ్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల గచ్చిబౌలిలోని పలు పబ్బులపై కూడా ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లోని పబ్బుల్లో డ్రగ్స్ తనిఖీలు నిర్వహించారు. క్లబ్ రోగ్, ఫ్రాట్ హౌస్ పబ్లో దాడులు జరిపిన ఎస్వోటీ పోలీసులు.. డ్రగ్స్ టెస్ట్లు నిర్వహించారు. ఈ క్రమంలో మొత్తం నలుగురికి గంజాయి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గంజాయి పాజిటివ్ వచ్చిన వారిలో ఫ్రాట్ హౌస్ పబ్ డీజే ప్లేయర్ శివ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే మాదాపూర్, కొండాపూర్లో పలు పబ్లపై జరిపిన దాడుల్లోనూ డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా.. ఇద్దరికి గంజాయి పాజిటివ్ అని తేలింది. మాదాపూర్ అఖాన్ పబ్లో ఒకరికి, కొండాపూర్ ఏ19 పబ్లో మరొకరికి గంజాయ్ పాజిటివ్ అని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక.. తెలంగాణను డ్రగ్స్ బూతం పట్టిపీడిస్తోంది. డ్రగ్స్తో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ యువత మాత్రం డ్రగ్స్ బారి నుంచి బయటకురాని పరిస్థితి. డ్రగ్స్ ఊబిలో చిక్కుకుని విలువైన జీవితాన్ని, భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేస్తోంది యువత. మరోవైపు విద్యార్థులు, యువతే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా ఈ దందాను నిర్వహిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కూడా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడుతున్న సందర్భాలు ఎన్నో. సెలబ్రెటీలను కూడా వదలకుండా పోలీసులు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా రెస్టారెంట్లు, పబ్లు, హెటల్స్లలో తరచూ దాడులు చేస్తూ డ్రగ్స్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో చోట డ్రగ్స్, గంజాయి సరఫరా కొనసాగుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి
షార్లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
ఫార్ములా ఈ రేస్ కేసు.. ఏసీబీ ఎదుటకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News