Share News

KCR Kaleshwaram Inquiry: విచారణ ముగిసింది.. కేసీఆర్ ఏం చెప్పారంటే

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:00 PM

KCR Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణ ముగియడంతో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్‌ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ సాగింది.

KCR Kaleshwaram Inquiry: విచారణ ముగిసింది.. కేసీఆర్  ఏం చెప్పారంటే
KCR Kaleshwaram Inquiry

హైదరాబాద్, జూన్ 11: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్‌ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్‌కు కేసీఆర్ పలు డాక్లుమెంట్లను అందించారు. మొదట దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్ చేత ప్రమాణం చేయించిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. మొత్తం 18 ప్రశ్నలను ఘోష్ అడిగారు. రీ ఇంజనీరింగ్, కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నలు వేసింది. రీ ఇంజనీరింగ్ చేయడానికి ప్రధాన కారణాలను కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు.


kcr-brk-bhavan.jpg

ప్రతిదీ కేబినెట్ ఆమోదంతో జరిగిందని కేసీఆర్ వివరణ ఇచ్చారు. కేబినెట్ ఆమోదంతోనే ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. స్థల మార్పు నీటి లభ్యత, కాళేశ్వరం నిర్మాణంపై వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిందని కమిషన్‌కు చెప్పారు. లైఫ్ లైన్ కాళేశ్వరం పుస్తకాన్ని కమిషన్‌కు అందజేశారు. అందులో కాళేశ్వరం ఉద్దేశ్యాలను వివరించారు. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని.. బ్యారేజీల్లో నీటి నిలువ అనేది ఇంజనీర్లు తీసుకునే నిర్ణయం తనకు సంబంధం లేదని కేసీఆర్ వెల్లడించారు.


బ్యారేజీల్లో నీటి నిల్వ కోసం మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా... తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. బ్యారేజీలు నీటిని ఎత్తిపోయడానికి నిర్మించినవి అని కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రాజెక్ట్ లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిది అంటూ కమిషన్ మరో ప్రశ్న సంధించింది. లొకేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. సీడబ్ల్యూసీ తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పిందని.. వ్యాప్కోస్ సర్వే చేసి నివేదిక ఇచ్చిందన్నారు. టెక్నికల్ టీం మూడు బ్యారేజీలు నిర్మించాలని చెప్పిందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదని చెప్పారు. టెక్నికల్ టీం ఇచ్చిన నివేదిక మేరకు లోకేషన్ మార్పు జరిగిందన్నారు. నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదంతోనే జరిగాయని కేసీఆర్ చెప్పారు. విచారణ ముగిసిన తర్వాత బీఆర్కే భవన్ ముందు కార్యకర్తలకు అభివాదం చేశారు మాజీ సీఎం. అనంతరం అక్కడ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.


కాగా.. కాళేశ్వరం విచారణలో భాగంగా ఈరోజు (బుధవారం) సిద్ధిపేటలోని ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు కేసీఆర్ చేరుకున్నారు. విచారణ నిమిత్తం లోపలికి వెళ్లిన కేసీఆర్ తనకు జలుబు ఉందని కమిషన్‌కు చెప్పారు. ఈ క్రమంలో విచారణ విషయంలో కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఓపెన్ కోర్టు విచారణను రద్దు చేసింది. కేసీఆర్ ఆనారోగ్యం కారణంగా బహిరంగ విచారణను రద్దు చేసిన కమిషన్.. ఇండోర్‌లో ముఖాముఖిగా మాజీ సీఎంను విచారించారు. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ 114 మందిని విచారించింది.


యశోదా ఆస్పత్రికి కేసీఆర్

కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ నేరుగా యశోదా ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ పరామర్శించనున్నారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేటలోని ఫాంహౌస్‌కు వెళ్లారు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే జారి పడ్డారు. ఈ క్రమంలో ఆయన తుంటి ఎముకలో గాయమైంది. వెంటనే ఆయనను హుటాహుటిన అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు.


ఇవి కూడా చదవండి

శ్రీధర్ ఆస్తులపై ఏసీబీ అధికారుల ఫోకస్

గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 11 , 2025 | 03:18 PM