ACB Case: కాలేశ్వరం ఈఈ రిమాండ్కు తరలింపు..
ABN , Publish Date - Jun 12 , 2025 | 10:05 AM
EE Remand: నీటిపారుదల శాఖకు చెందిన అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

Hyderabad: నీటిపారుదల శాఖకు చెందిన కాలేశ్వరం (Kaleswaram) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (Executive Engineer) నూనె శ్రీధర్ (Nune Sridhar)ను రిమాండ్ (Remand)కు తరలించారు. మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ (ACB) అధికారులు.. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గురువారం తెల్లవారుజామున చంచల్గూడా జైలుకు తరలించారు. కాగా ఆయన బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు కస్టడీకి కోరనున్నారు. రూ. వందల కోట్లు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది.
ఆదాయానికి మించిన ఆస్తులు..
కాగా నీటిపారుదల శాఖకు చెందిన అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. చొప్పదండి డివిజన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. శ్రీధర్తో పాటు అతని బంధువులు, సన్నిహితులకు సంబంధించి.. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో 13 చోట్ల బుధవారం ఉదయం ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. కరీంనగర్లో శ్రీధర్ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. బెంగళూరులో నాలుగు చోట్ల, హైదరాబాద్లో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు. శ్రీధర్ అక్రమార్జనకు సంబంధించి భారీగానే ఆస్తులను గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన గాయత్రి పంప్హౌస్ బాధ్యతలను శ్రీధర్ చూసేవారని, అక్కడ ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్ల కొనుగోళ్లలో ఆయన కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలంలో నిర్మించిన భారీ పంప్హౌస్ బాధ్యతలు కూడా శ్రీధర్ చూశారని తెలుస్తోంది.
శ్రీధర్ ఆస్తుల జాబితాలోని వివరాలు..
హైదరాబాద్లోని మలక్పేటలో విలాసవంత మైన నాలుగంతస్తుల భవనం, షేక్పేటలో ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ స్కై హైలో 4,500 చదరపు అడుగుల ఫ్లాట్, తెల్లాపూర్లోని మరో ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ ఉర్జిత్ ఎన్క్లేవ్లో లగ్జరీ విల్లా, వరంగల్లో జీ+3 భవనం, కరీంనగర్లో మూడు ఫ్లాట్లు, ఒక ఇండిపెండెంట్ ఇల్లు, అమీర్పేటలోని వాణిజ్య సముదాయంలో ఆస్తులు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లోని అత్యంత ఖరీదైన కమ్యూనిటీల్లో 19 ఇళ్ల స్థలాలు, కరీంనగర్లోని పలు హోటళ్లలో వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించి డాక్యుమెంట్లను గుర్తించామని ఏసీబీ డీజీ విజయ్కుమార్ తెలిపారు. అలాగే రెండు కార్లు, బ్యాంకు డిపాజిట్లు, లాకర్లను గుర్తించామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మలక్పేటలో నివసిస్తున్న శ్రీధర్ మార్చి 6న తన కుమారుడి వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో థాయ్లాండ్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు హైదరాబాద్ శివార్లలోని ఓ ఫాంహౌస్లో హల్దీ, సంగీత్ ఫంక్షన్ చేశారు. మార్చి 9న నాగోలులోని శివం కన్వెన్షన్లో కుమారుడి రిసెప్షన్ వేడుకలు నిర్వహించారు. కుమారుడి పెళ్లికి రూ. కోట్లు ఖర్చుపెట్టడంతో ఆయనపై ఏసీబీకీ ఫిర్యాదులు అందాయి. శ్రీధర్ ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆనాడే వేరే పార్టీలోకి పోలేదు:ఎమ్మెల్యే రాజా సింగ్
పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి..
For More AP News and Telugu News