Kaleswaram Commission: వారిపై చర్యలకు కాళేశ్వరం కమిషన్ కీలక సిఫార్స్
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:28 PM
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కమిషన్ అందించిన నివేదికలో కేసీఆర్ పేరు 32 సార్లు, హరీష్ రావు పేరు 19 సార్లు, ఈటల పేరు 5 సార్లు వచ్చింది.

హైదరాబాద్, ఆగస్ట్ 04: కాళేశ్వరం ప్రాజెక్ట్పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను అధ్యయనం చేసిన ముగ్గురు అధికారుల కమిషన్ 60 పేజీల సారాంశాన్ని తయారు చేసి.. సోమవారం కేబినెట్ ముందు ఉంచింది. ఈ నివేదికలో మాజీ సీఎం కేసీఆర్ పేరు 32 సార్లు, హరీష్ రావు పేరు 19 సార్లు, ఈటల పేరు 5 స్లారు ప్రస్తావనకు వచ్చినట్లు గుర్తించారు. అయితే బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిందని.. కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. అంతే కాదు.. ఆ శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉదాసీనంగా, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని తప్పు పట్టింది. కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలు సమర్పించారని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. 650 పేజీలతో ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికలోని సారాన్ని తీసేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిషన్కు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్.. ఆదివారం అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశమై చర్చించారు.
అనంతరం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన 650 పేజీల సారాన్ని 60 పేజీలకు కుదించారు. ఈ నివేదికను సోమవారం తెలంగాణ సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఉంచారు. అందుకు సంబంధించిన అంశాలను భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ద్వారా ప్రజంటేషన్ ఇచ్చారు.