Kaleshwaram project: కాళేశ్వరంపై విచారణ తిరిగి ప్రారంభం
ABN , Publish Date - Jun 06 , 2025 | 10:02 AM
Kaleshwaram project: కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు అవుతారు. అలాగే ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghose Commission) విచారణ (Investigation) తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. విచారణలో భాగంగా కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ (Etela Rajender) హాజరు కానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కార్పొరేషన్ అప్పులు, చెల్లింపులపై కమిషన్ ఈటెలను ప్రశ్నించనుంది. గత ప్రభుత్వంలో కాళేశ్వరంకు ఖజానా నుంచి చేసిన చెల్లింపులు, పాటించిన నిబంధనలపై కమిషన్ ఆరా తీయనుంది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ప్రశ్నావళి సిద్ధం చేశారు.
ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు గుర్తింపు..
కాళేశ్వరం నిర్మాణం సమయంలో కాంట్రాక్ట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు కమిషన్ గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మాణం ఆర్థిక పరమైన అంశాలపై ఈటెలను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కమిషన్ విచారణలో ఏం చెబుతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరుకానున్నారు. అలాగే 11న మాజీ సీఎం కేసీఆర్ను విచారణకు రావాలని కమిషన్ నోటీసు ఇచ్చింది. కాగా మొదట జూన్ 5న విచారణకు రావాలని నోటీస్ ఇవ్వగా.. మరింత సమయం కావాలని కేసీఆర్ కోరగా.. ఈనెల 11న విచారణకు రావాలని కమిషన్ పేర్కొంది.
9న కమిషన్ ముందుకు హరీష్ రావు..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యత ప్రమాణాలు, ఆర్థిక అంశాలు వంటి వాటిపై కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజినీర్లను, రిటైర్డ్ ఇంజినీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లను స్వీకరించి వాటి ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఎ) నివేదికలను కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంది. విచారణలో భాగంగా జూన్ 9వ తేదీ (సోమవారం) మాజీ మంత్రి హరీష్రావు కమిషన్ ముందుకు రానున్నారు.
11న కమిషన్ ముందుకు కేసీఆర్..
అలాగే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. విచారణకు స్వయంగా హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కాగా రాజకీయప్రతినిధుల విచారణలు తదుపరి కమిషన్ తుది నివేదికను ఈనెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కంటోన్మెంట్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు..
జగన్ సాధించిన అతిపెద్ద ఘనత ఏంటంటే..
For More AP News and Telugu News