HYDRA Commissioner: సోషల్ మీడియాలో వార్తలపై హైడ్రా కమిషనర్ గుస్సా
ABN , Publish Date - Sep 22 , 2025 | 01:13 PM
బిల్డర్స్తో హైడ్రా ఎక్కడా లాలూచి పడలేదని తేల్చిచెప్పారు హైడ్రా కమిషనర్. 12 పెద్ద బిల్డర్స్పై కేసులు బుక్ చేశామన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: నాలాలు, చెరువులను కబ్జా చేసి కట్టిన ఆక్రమణలు కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRA Commissioner Ranganath) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలాలు, చెరువులను కబ్జా చేస్తే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చెరువులు సమాజ ఆస్తులని.. వాటిని కాపాడే బాధ్యత తమదని వెల్లడించారు. బతుకమ్మ కుంట రూపు రేఖలు మార్చామన్నారు. గాజులరామారంలో ల్యాండ్ గ్రాబర్స్ అడ్డగోలుగా కబ్జా చేశారని తెలిపారు. 300 ఎకరాలకు పైగా కబ్జా చేశారని.. 900 పైగా ఇళ్ళు ఉన్నాయని వెల్లడించారు. నిన్న 260 ఇళ్ళు కూల్చామని.. 640 ఇళ్ళు కూల్చలేదని తెలిపారు. ప్రభుత్వ స్థలం అని తెలియక కొంత మంది పేదలు ఇళ్ళు కొనుక్కున్నారని చెప్పారు.
మేము రాజీపడలేదు..
బిల్డర్స్తో హైడ్రా ఎక్కడా లాలూచి పడలేదని తేల్చిచెప్పారు హైడ్రా కమిషనర్. 12 పెద్ద బిల్డర్స్పై కేసులు బుక్ చేశామన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్టెక్స్, వాసవీ బిల్డర్స్తో తాము రాజీపడలేదని చెప్పుకొచ్చారు. 2024, జులై 19న హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 923.14 ఎకరాలు కాపాడమన్నారు. దీని విలువ 45 నుంచి 50 వేల కోట్ల రూపాయలుగా తెలిపారు. దాదాపు 581 అక్రమణలు కూల్చివేశామన్నారు.
50, 60 ఏళ్ల నుంచి చెరువులు కబ్జా అవుతున్నాయని అన్నారు. హైడ్రా 14 నెలల నుంచి చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. చెరువులు, నాలాల కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. చెరువుల్లో డంపింగ్పై 75 కేసులు పెట్టామని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు ముగ్గురు నాలాల్లో కొట్టుకుపోయారని.. అందులో వలిగొండ దగ్గర ఒక్కరి మృతదేహం మాత్రమే దొరికిందని.. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
ప్రభాకర్ బెయిల్ రద్దుపై సుప్రీం ఏం తేల్చిందంటే
Read Latest Telangana News And Telugu News