Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
ABN , Publish Date - May 19 , 2025 | 10:48 AM
Hydra Demolitions: హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు షురూ అయ్యాయి. హైదర్నగర్లో హైడ్రా కూల్చివేతలతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

హైదరాబాద్, మే 19: భాగ్యనగరంలో మరోసారి హైడ్రా (HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదర్నగర్లో ఉద్రిక్తతల నడుమ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికులు, హైడ్రా సిబ్బందికి వాగ్వాదం నెలకొంది. హైదర్నగర్లో భారీగా పోలీసులు మోహరించారు. ప్లాట్లోని యజమానులను కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈరోజు (సోమవారం) తెల్లవారుజాము నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైదర్నగర్లో కూల్చివేతలు చేస్తోంది హైడ్రా.
దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి హైడ్రా పరిష్కారం చూపినట్లు తెలుస్తోంది. తొమ్మిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 79 మంది ప్లాట్ల ఓనర్లు హైడ్రాకు మద్దతు తెలిపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా హైదర్నగర్లో ఈ స్థలాన్ని ఆక్రమించి పార్కింగ్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి. ఓ ప్రైవేటు వ్యక్తి ఈ ఆక్రమణలకు పాల్పడటంతో ఆ స్థలం యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 20 ఏళ్లుగా బాధితులు పోరాటం చేస్తున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో హైడ్రా రంగంలోకి దిగింది. ఈ భూమికి సంబంధించి ఎనిమిది నెలల క్రితమే తీర్పు వచ్చినప్పటికీ ప్రైవేటు వ్యక్తి ఖాళీ చేయకపోవడంతో హైడ్రా రంగ ప్రవేశం చేసి కూల్చివేతలు చేపట్టింది. హైదర్నగర్ నుంచి మియాపూర్ వెళ్లే మార్గంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చుట్టూ షెడ్లను నిర్మించి అక్రమ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్థలం అంతా కూడా హెచ్ఎమ్డీఏ లే అవుట్కు చెందినది. ఈ విషయాన్ని హైడ్రా నిర్ధారించింది.
హైడ్రా చీఫ్ రంగనాథ్ ఇటీవల హైదర్నగర్లో ఆక్రమణలకు గురై స్థలం వద్దకు వచ్చి పరిశీలించారు. డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత హైడ్రా సిబ్బంది ఈరోజు నేరుగా కూల్చివేతలు చేపట్టింది. కూల్చివేతల సమయంలో ఈ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి హైడ్రా సిబ్బందిని అడ్డుకునేందుకు యత్నించాడు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. హైడ్రాకు సంబంధించిన వందలాది మంది సిబ్బందితో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేబడుతోంది.
ఇటీవల కాలంలో హైడ్రా పోలీస్స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత మరింత దూకుడు పెంచింది. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయనే దానిపై తమ దృష్టికి వస్తే ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని హైడ్రా చీఫ్ రంగనాథ్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
Vizianagaram: బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం.. వెలుగులోకి సంచలన విషయాలు
Diamond: వజ్రాన్ని విక్రయించిన రైతు.. ధర ఎంతంటే..
Read Latest Telangana News And Telugu News