Robbery: ఇళ్లు అద్దెకు కావాలంటూ వచ్చి..ఏం చేశారంటే
ABN , Publish Date - May 03 , 2025 | 10:42 AM
Robbery: వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని పార్సిగుట్టలో పి. పారిజాత అనే మహిళ ఒంటరిగా జీవిస్తోంది. తాను ఉంటున్న ఇంట్లో మరో పోర్షన్ అద్దెకు ఇవ్వాలని భావించిన మహిళ టూలెట్ బోర్డు పెట్టింది.

హైదరాబాద్, మే 3: నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా దొంగతనం చేయడంలో కూడా రూటు మారుస్తున్నారు దుండగులు. సాధారణంగా ఇంట్లో ఎవరూ లేనిది చూసుకుని, రాత్రి సమయాల్లో దొంగలు దొంగతనానికి పాల్పడుతుంటారు. బ్యాంకుల్లో, ఏటీఎంలలో, ఒంటరిగా ఉన్న వ్యక్తుల ఇళ్లలో దొంగతనం చేస్తుంటారు. ఎప్పుడూ ఒకే ఫార్మాట్లో కాకుండా వెరైటీగా దొంగతనం చేయాలని భావించారు సదరు దుండగులు. ఇందు కోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే తడువుగా తమ ప్లాన్ను అమలు చేశారు కూడా. ఇంతకీ దొంగలు ఏ రకంగా దొంగతనానికి పాల్పడ్డారో ఇప్పుడు చూద్దాం.
సికింద్రాబాద్లో ఒంటరిగా ఉన్న మహిళ నుంచి భారీగా బంగారాన్ని అపహరించారు దుండగులు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే దొంగలు దర్జాగా వచ్చి మరీ దొంగతనం చేశారు. వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని పార్సిగుట్టలో పి.పారిజాత అనే మహిళ ఒంటరిగా జీవిస్తోంది. తాను ఉంటున్న ఇంట్లో మరో పోర్షన్ అద్దెకు ఇవ్వాలని భావించిన మహిళ టూలెట్ బోర్డు పెట్టింది. ఇదే ఆమె పాలిట శాపంగా మారినట్లైంది. ఇంట్లో ఉన్న మహిళ దగ్గరకు ఇద్దరు యువకులు బైక్పై వచ్చారు. మహిళ ముందు అమాయకంగా నటించిన ఇద్దరు యువకులు తమకు ఇళ్లు అద్దెకు కావాలని అడిగారు. అలాగే ఇళ్లు చూస్తామంటూ ఆమెను నమ్మించి లోపలకు వచ్చారు. అప్పుడే వాళ్ల అసలు రూపాన్ని మహిళకు చూపించారు.
Madhya Pradesh: 3 ఏళ్ల చిన్నారికి సంతారా.. పిన్న వయసులో ప్రపంచానికి వీడ్కోలు.. అసలేంటీ ఆచారం..
మహిళతో లోపలికి వచ్చిన దుండగులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. మహిళను బెదిరించి మరీ భారీగా బంగారు నగలను దోచుకున్నారు. ముందుగా మహిళను బెడ్ రూంలో కూర్చీకి తాళ్లతో కట్టేసి.. అరవకుండా మూతికి ప్లాస్టర్ వేసి ఆపై కత్తితో బెదిరించారు. యువకుల బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైంది మహిళ. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సదరు దుండగులు ఇంట్లో ఉన్న మూడు తులాల బంగారాంతో పాటు రూ.6 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యువకులు వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Pakistan Ceasefire: కశ్మీర్లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్
Read Latest Telangana News And Telugu News