MLC Election: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ప్రారంభం..
ABN , Publish Date - Apr 23 , 2025 | 08:42 AM
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. 81 కార్పొరేటర్లు, 31 ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం జీహెచ్ఎంసీ ఆఫీసులో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.

MLC Election : హైదరాబాద్ (Hyderabad) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Election) బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది (Polling Begins). సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల కోసం బల్దియా ప్రధాన కార్యాలయంలోని భవన నిర్వహణ విభాగం గదిలో, 81 మంది కార్పొరేటర్ల కోసం లైబ్రరీ హాల్లో అధికారులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ (144 Section) అమలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయ ఉద్యోగులకు సెలవు ఇచ్చారు. ఈ రోజుకు బదులుగా జూన్ 14 రెండో శనివారం పని దినంగా పరిగణిస్తామని అధికారులు ప్రకటించారు. పోలింగ్లో మొదటి ప్రాధాన్య ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటవుతుంది. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు ఎక్కువ పొందినవారు విజేతగా నిలుస్తారని చెప్పారు. 25వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీలో ఉన్నారు.
Also Read..: ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు
పార్టీ ల బలాబలాలు
ఎంఐఎంకు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 50..
బీజేపీకి 18 కార్పొరేటర్లు, 6 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 24..
కాంగ్రెస్కు ఏడుగురు కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 14..
బీఆర్ఎస్కు 15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 24..
కాగా సరిపడ సంఖ్య బలం లేకున్నా తొలిసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీజేపీ నిలిచింది. గత ఇరవై రెండేళ్లుగా హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా అవుతున్నాయి. ఈసారి హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది.
పోటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరం..
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొనవద్దంటూ ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించిన నేపథ్యంలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. అయితే పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ తమ ఓటర్ల విషయంలో ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బరిలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే ఉండగా.. గెలుపు కోసం రెండు పార్టీలూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్ల బలం ఎక్కువగా ఉన్నా.. తమ ప్రజాప్రతినిధులు కట్టు తప్పకుండా ఎంఐఎం కట్టడి చేసింది. మరోవైపు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పలు ఆఫర్లు ఇస్తున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కొందరు బీఆర్ఎస్ ఓటర్లకు హామీ ఇస్తున్నట్టు సమాచారం. దీంతో వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్కు దూరంగా ఉంటారా.. లేదా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక కాంగ్రె్సకు సంబంధించి హైదారాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం ఆ పార్టీ ఓట్లతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉందని ఓ ప్రజాప్రతినిధి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News