Gulzar House Incident: గుల్జార్ హౌస్ ప్రమాదానికి అసలు కారణం ఇదే
ABN , Publish Date - May 22 , 2025 | 11:58 AM
Gulzar House Incident: నగరంలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో వాస్తవాలను ఫైర్ అధికారులు బయటపెట్టారు. ఇన్వర్టర్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తేల్చారు.

హైదరాబాద్, మే 22: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద (Guljar House Fire Accident) ఘటనపై అసలు నిజాలను బయటపెట్టారు ఫైర్ అధికారులు (Fire Officers). ఇన్వర్టర్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే గుల్జార్ హౌస్లో మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారించారు. అగ్ని ప్రమాదం జరిగిన టైంలో ఇంట్లో రెగ్యులర్ కరెంట్ ఆఫ్లో ఉందని.. ఇన్వర్టర్ ద్వారా సెకండరీ పవర్ సప్లై మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని హైదరాబాద్తో పాటు నాగపూర్కు చెందిన ఫైర్ ఫోరెన్సిక్ ఇంజనీర్లు నిర్ధారించారు. ఫైర్ ఎక్స్పర్ట్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి నివేదికను ఫైర్ డీజీకి అందించనున్నారు.
మరోవైపు అగ్ని ప్రమాదం జరిగాక పొగ ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు బయటకి రాకుండా రూమ్లోనే ఉండి తలుపులు వేసుకున్నారు. దీంతో పొగను పీల్చి ఊపిరి ఆడకుండా పడిపోయారు. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక పోవడం వల్లే వారంతా చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. త్వరలో ఘటన స్థలానికి ఓఎన్జీసీ కంపెనీ బృందాలు వెళ్లనున్నాయి.
కాగా.. ఈనెల 18 (ఆదివారం) తెల్లవారుజామున పాతబస్తీలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా ప్రహ్లాద్ మోదీ తన కుటుంబ సభ్యులతో కలిసి గుల్జార్ హౌస్లో నివాసం ఉంటున్నారు. ముందు రోజు ఓ వేడుకకు హాజరైన కుటుంబసభ్యులు అంతా కలిసి ఇంట్లోనే నిద్రించారు. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబసభ్యులు నిద్రలో ఉన్నారు. దీంతో ప్రమాద తీవ్ర పెరిగింది. మంటలు వ్యాపించి, దట్టమైన పొగ వ్యాపించడంతో గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే బయటకు వెళ్లేందుకు పరుగులు తీశారు. అయితే ఆ భవనంలోకి వెళ్లేందుకు ఒకే మార్గం ఉండటం.. అక్కడ మంటలు వ్యాపించడంతో వారు తిరిగి పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అక్కడ కూడా మంటలు చెలరేగడంలో ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో గదిలో ఉన్న వారు ఊపిరి ఆడక అల్లాడిపోయారు. ఆ తరువాత అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కూడా ఇంట్లోని వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న వారిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మొత్తం 21 మందిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎనిమిది మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. అలాగే అగ్నిప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఈ ప్రమాదాన్ని సుమోటోగా కేసు నమోదు చేసిన హెచ్ఆర్సీ.. ఈ ఘటనలో 17 మంది మరణానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా సీపీ, ఫైర్ డీజీలను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
ఇందిరా మహిళా శక్తి బజార్కు సుందరీమణులు
Read Latest Telangana News And Telugu News