Cyber Crime: జడ్జి పేరు చెప్పారు.. డబ్బులు లాగారు.. కేటుగాళ్ల నయా మోసం
ABN , Publish Date - Jun 10 , 2025 | 10:17 AM
Cyber Crime: వనస్థలిపురంలో మాజీ చీఫ్ ఇంజనీర్ నుంచి దాదాపు కోటిన్నర కాజేశారు కేటుగాళ్లు. సదరు వ్యక్తి నుంచి సొమ్మును ఎలా కొట్టేశారో తెలిస్తే మాత్రం అంతా షాకవ్వాల్సిందే. మాజీ చీఫ్ ఇంజనీర్కు ఒక రోజు ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

హైదరాబాద్, జూన్ 10: ఈమధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు డబ్బును కాజేయడంలో కొత్త ప్రయోగాలు చేస్తూ పలువురిని ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని పోలీసులు ఎన్నో సార్లు హెచ్చరించినప్పటికీ కొందరు అమాయకులు మాత్రం వారి మాయలో పడి ఉన్నదంతా పోగొట్టుకుంటున్న పరిస్థితి. ఎవరైనా ఫోన్లు చేసి బ్యాంకు అధికారులమని.. పలానా వ్యక్తులమంటూ కాల్ చేసి బ్యాంకు ఖాతా నెంబర్లు, ఓటీపీలు అడిగితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే అవగాహన కల్పిస్తుండటంతో సైబర్ నేరగాళ్లు కూడా తమ రూటు మార్చారు.
ఈ సారి ఏకంగా సుప్రీం కోర్టు జస్టిస్ పేరు చెప్పి మరీ మోసానికి తెరలేపారు కేటుగాళ్లు. సుప్రీం కోర్టు జడ్జి పేరు చెప్పేసరికి సదరు వ్యక్తి భయంభ్రాంతులకు గురై తన వద్ద సొమ్మును మొత్తం కేటుగాళ్లకు సమర్పించేశాడు. చివరకు అసలు విషయం తెలిసి అవాక్కవడం బాధితుడి వంతైంది. ఇంతకీ ఏం జరిగింది.. సైబర్ నేరగాళ్లు ఎలా మోసానికి పాల్పడ్డారో ఇప్పుడు చూద్దాం.
వనస్థలిపురంలో మాజీ చీఫ్ ఇంజనీర్ నుంచి దాదాపు కోటిన్నర కాజేశారు కేటుగాళ్లు. సదరు వ్యక్తి నుంచి సొమ్మును ఎలా కొట్టేశారో తెలిస్తే మాత్రం అంతా షాకవ్వాల్సిందే. మాజీ చీఫ్ ఇంజనీర్కు ఒక రోజు ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఒక కేసులో మీ పేరు వచ్చిందని సైబర్ నేరగాళ్లు భయపెట్టించారు. కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుందని చెప్పి నమ్మించారు కేటుగాళ్లు. ఈ కేసును జస్టిస్ స్వయంగా విచారిస్తున్నారని మాయ మాటలు చెప్పారు. జస్టిస్ వీడియో కాల్ రాగానే నమస్కరించి మర్యాదగా మాట్లాడాలని చెప్పారు.
ఇలా ఫోన్ కాల్ రావడం, ఏకంగా జస్టిస్ నుంచే వీడియో కాల్ వస్తుందని చెప్పడంతో నమ్మేశాడు సదరు వ్యక్తి. కొన్ని నిమిషాల్లోనే నకిలీ జస్టిస్ వీడియో కాల్లోకి వచ్చారు. ఈ కేసు తీవ్రంగా ఉందని.. అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కేసు విషయమై డబ్బులను సుప్రీం కోర్టు అకౌంట్లో జమ చేయాలని చెప్పాడు నకిలీ జడ్జి. కేసు అయిపోగానే డబ్బులు తిరిగి వస్తాయంటూ నమ్మబలికారు. నకిలీ జడ్జి చెప్పింది నమ్మిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్.. దాదాపు కోటి 50 లక్షల రూపాయలను వారు చెప్పిన విధంగా బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఆ తరువాత రోజులు గడుస్తున్నప్పటికీ డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. తనకు వచ్చిన ఫోన్ కాల్, డబ్బులు ఏ విధంగా డిపాజిట్ చేశాడో అనే విషయాన్ని పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు.
బ్యాంక్ అధికారికి బురిడీ
మరోవైపు ఓ బ్యాంక్ అధికారిని కూడా మోసం చేసి దాదాపు 4 లక్షలు కాజేశారు సైబర్ నేరగాడు. అడ్రస్ అబ్డేడ్ చేయాలని చెప్పి.. కాల్ చేసి అకౌంట్లో ఉన్న రూ.3.92 లక్షలను కాజేశాడు. ముషీరాబాద్కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాడు కాల్ చేశాడు. వై బ్యాంక్ రిలేషన్ షిప్ మేనేజర్ అని చెప్పి అడ్రస్ అప్డేట్ చేయాలని నమ్మబలికాడు. ఏపీకే ఫైల్స్ పంపడంతో బాధితుడు ఇన్స్టాల్ చేశాడు. ఆ వెంటనే బాధితుడి అకౌంట్లో నుంచి రూ.3.92 లక్షల నగదు మాయం అయ్యింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇవి కూడా చదవండి
నా ముద్దుల మావయ్య బాలయ్య... మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు
రాజా మర్డర్.. వైరల్గా మారిన పెళ్లి వీడియో..
Read Latest Telangana News And Telugu News