ED: సురానా ఇంట్లో భారీగా నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:02 AM
వివిధ బ్యాంకులకు రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు నగదుతో పాటు పలు డాక్యుమెట్స్ స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎన్ఫోర్స్నమెంట్ డైరక్టరేట్ అధికారులు రెండోసారి చేపట్టిన సోదాలు ముగిసాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు .. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవులకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షేల్ కంపెనీలకు నిధుల బదలాయింపు చేశారని, పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. అనుబంధ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఇంట్లో కూడా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సాయి సూర్య సురానా కార్యాలయాల్లో కోట్లలో నగదుతో పాటు పలు డాక్యుమెట్స్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ సతీష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వట్టి నాగులపల్లిలో సతీష్ వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
Also Read..: ఆ టాబ్లెట్స్ మోతాదుకు మించి తీసుకుంటే..
రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ...
కాగా వివిధ బ్యాంకులకు రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ సంస్థలు- సాయిసూర్య డెవలపర్స్, ఆర్యవన్ ఎనర్జీలపై చెన్నైవిభాగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ మోసాలపై ఐడీబీఐ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో 2019లోనే బెంగళూరు విభాగం సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. సురానా గ్రూప్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు చెన్నైలో నివసిస్తున్నా.. వారికి హైదరాబాద్లో వ్యాపారాలున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని.. అనుబంధ సంస్థలకు అక్రమంగా మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.
దీంతో..హైదరాబాద్లోని సురానా గ్రూప్, సాయిసూర్య, ఆర్యవన్ ఎనర్జీ కార్యాలయాలు, వాటి డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో బోయినపల్లి డైమండ్ పాయింట్ సమీపంలోని అరిహంట్ కార్డు మాస్టర్ ఎన్క్లేవ్ కాలనీలోని సురానా యజమానుల ఇంట్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి. కీలకమైన పత్రాలు, భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు.. సురానా గ్రూప్ ఎండీ దేవేందర్ సురా నా ఇళ్లు, కార్యాలయాలు, సాయిసూర్య, ఆర్యవన్ ఎనర్జీ కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు జరిగాయి. కాగా.. సాయిసూర్య డెవలపర్స్ ఎండీ సతీశ్చంద్ర గుప్తాపై ఇటీవలే పోలీసులకు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టిస్తామంటూ ప్రీలాంచ్పేరిట కోట్లను వసూలు చేసి, మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రూ.113.32 కోట్ల విలువైన స్థిరచరాస్తుల జప్తు..
గతంలో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.113.32 కోట్ల విలువైన స్థిరచరాస్తులను తాత్కాలికంగా ఈడీ అధికారులు జప్తు చేశారు. తమ బంధువులు, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్లుగా నియమించి దినేష్ చంద్ సురానా బ్యాంకులను మోసం చేశారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. సురానా గ్రూప్ కేమన్ ఐలాండ్తో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లలో డమ్మీ డైరెక్టర్లను నియామకం చేసి.. ఆయా కంపెనీల్లోకి బ్యాంకు రుణాలను సురానా మళ్లించారు. సింగపూర్లో నాలుగు కంపెనీలు స్థాపించి వస్తువుల ఎగుమతి చేసి ఆ డబ్బును సురానా భారతదేశంలో అందుకున్నారు. దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ, కంపెనీల పేర్లలో చరాస్తులు, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్టు ఈడీ అధికారులు నిర్ధారించారు. సోదాలు ముగిసాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్
జైకా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ..
వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల తూటాలు
For More AP News and Telugu News