Share News

BRS Internal Rift: కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురుచూపులు

ABN , Publish Date - Jun 05 , 2025 | 09:55 AM

BRS Internal Rift: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తన కుమార్తె కవితపై సీరియస్‌గా ఉన్నారు. ఆమె లేఖ లీక్ వ్యవహారం జరిగి పది రోజులు దాటినా కేసీఆర్ ఇంత వరకు కవితను పిలిచి మాట్లాడలేదు. మరోవైపు కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ దూరంగా ఉన్నారు.

BRS Internal Rift: కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురుచూపులు
BRS Internal Rift...

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎపిసోడ్‌పై బీఆర్ఎస్‌ (BRS)లో ఉత్కంఠ (Tension) కొనసాగుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) పిలుపు కోసం కవిత ఎదురుచూస్తున్నారు. ఆమె లేఖ లీక్ (Letter Leak) వ్యవహారం జరిగి పది రోజులు దాటినా కేసీఆర్ ఇంతవరకు కవితను పిలిచి మాట్లాడలేదు.. సమయం కూడా ఇవ్వలేదు. పార్టీలో అంతర్గత అంశాలు, కేటీఆర్‌పై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తండ్రి కేసీఆర్ కుమార్తెపై సీరియస్‌గా ఉన్నారు. మరోవైపు కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ దూరంగా ఉన్నారు. జాగృతి ఆధ్వర్యంలోనే కవిత తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆరే తన నాయకుడు అంటున్నప్పటికీ.. బీఆర్ఎస్ కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. కవిత లేఖ వ్యవహారం తర్వాత ‌ బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది.


కేటీఆర్ రాక ఆలస్యం..

మరోవైపు మే 26న లండన్.. అటు నుంచి అమెరికా వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకేలో పర్యటించి.. అమెరికా డల్లాస్‌లో జరిగిన బీఅర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొన్నారు. మరో నాలుగు రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. ఈనెల‌ 10న‌ అమెరికా నుంచి కేటీఆర్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్ళనున్నారు. దీంతో 10న హైదరాబాద్‌కు వచ్చేలా కేటీఆర్ ప్రణాలికలు చేసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా కవిత ఎపిసోడ్ కొనసాగుతోంది. కేటీఆర్ అమెరికాలో ఉండగా.. అన్నపై కవిత తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కవిత చేసిన కామెంట్స్‌పై కేటీఆర్ స్పందిస్తారా.. లేదా అనే దానిపై బీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది.


తెలంగాణ జాగృతి ద్వారా కవిత కార్యక్రమాలు..

కవిత తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయంతోనే ఉన్నారని సమాచారం. తండ్రి నుంచి పిలుపు వచ్చినా, రాకున్నా.. తన పని తాను జాగృతి ద్వారా చేసుకుపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన కార్యక్రమాల్లో జాగృతి జెండాలు, బ్యానర్లు తప్ప.. బీఆర్‌ఎ్‌సకు సంబంధించినవి ఎక్కడా లేకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ నాయకులు, కార్యకర్తలతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాకు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ హాజరు కాకపోయినా.. కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోగలిగామని జాగృతి నేతలు అన్నారు. దీని బట్టి చూస్తే బీఆర్‌ఎస్‌లో స్పష్టమైన విభజన వచ్చినట్లు కనిపిస్తోంది. కవిత సాంకేతికంగా గులాబీ పార్టీలో కొనసాగుతున్నా.. వ్యవహారాలు మాత్రం ఎవరికివారే యమునా తీరే అన్న రీతిలోనే నడుస్తున్నాయి. ఏదైనా ఒక కీలక పరిణామం జరిగే వరకు పరిస్థితి ఇదే రీతిలో ఉండే అవకాశాలున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జనాభా లెక్కల సేకరణకు ముహూర్తం ఖారారు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

For More AP News and Telugu News

Updated Date - Jun 05 , 2025 | 10:00 AM