Share News

ATM Fraud: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి

ABN , Publish Date - May 03 , 2025 | 04:05 PM

ATM Fraud: వినియోగదారులు ఏటీఎంల వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. కానీ డబ్బుల రాకపోవడంతో వెనుదిరిగారు. కొద్దిసేపటికే తమ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్లు వచ్చిన సందేశం చూసి షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకుందాం.

ATM Fraud: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి
ATM Fraud

హైదరాబాద్, మే 3: ఏటీఎంలలో (ATM) డబ్బులు డ్రా చేసే వారినే లక్ష్యంగా చేసుకుని కొత్త రకం మోసానికి తెరలేపారు కొందరు దుండగులు. డబ్బు డ్రా చేసేందుకు వచ్చిన వ్యక్తులకు మాయ మాటలు చెప్పి డబ్బులు రాకుండా చేయడం.. ఆపై వారు వెళ్లిపోగానే ఆ డబ్బును ఈ కేటుగాళ్లు తీసేసుకోవడం చకచకగా జరిగిపోయేవి. ఇలా ఒకటి కాదు రెండు దాదాపు 12 సార్లు ఇదే విధంగా వినియోగదారులను మోసం చేసి డబ్బును కాజేశారు. అయితే తాము డబ్బును విత్‌ డ్రా చేయన్నప్పటికీ తమ అకౌంట్‌లో నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్‌లు రావడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఆ దుండగుల భరతం పట్టారు పోలీసులు. ఇంతకు ఏం జరిగిందో ఈ స్టోరీలో చదవండి.


బ్యాంకు సెలవు రోజును ఎంచుకుని భద్రతా సిబ్బంది లేని ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా దొంగతనాలకు తెరలేపిన అంతర్రాష్ట్ర దొంగలను తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏటీఎంల వద్ద వీరు ఏ విధంగా దొంగతనం చేశారనే వివరాలను తిరుమలగిరి ఏసీపీ రమేష్ ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతికి తెలియజేశారు. ఏటీఎంల వద్ద వినియోగదారులను మోసం చేసి డబ్బులు కాజేసిన నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతిక్ అహ్మద్, మహమ్మద్ డానిష్‌గా గుర్తించారు. వీరు వృత్తిరీత్యా డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యూపీకి చెందిన ఈ ఇద్దరు దుండుగులు ముంబైలో నివాసం ఉంటున్నారని, ముంబైలోనే ఈ తరహా దొంగతనానికి ప్రణాళిక రచించినట్లు ఏసీపీ తెలిపారు.

Shocking Incident: భీమవరంలో దారుణం.. నడిరోడ్డుపై కత్తిపట్టుకుని



దొంగతనం ఎలా చేశారంటే

ఈనెల 27న ఆర్డీఏ కార్యాలయం సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎంలో నగదు ఉపసంహరణ కోసం వచ్చే వినియోగదారులను తప్పుదోవ పట్టించి నగదును అపహరించినట్లు తెలిపారు. ఏటీఎంలలో నగదును విత్‌ డ్రా చేసే సమయంలో డిస్పెన్సర్‌కు టేపు అతికించి డబ్బులు రాకుండా ఇరుక్కుపోయేలా చేశారు దుండగులు. ఇవేమీ తెలియని వినయోగదారులు ఎప్పటి లాగే ఏటీఎంకు వచ్చి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎంత చేసినా డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. వారు వెళ్లిన వెంటనే దుండగులు అక్కడకు చేరుకుని వెంటనే టేపును తొలగించి డబ్బులు తీసుకునే వారు. ఇదంతా కూడా అక్కడ సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.


నగదు విత్ డ్రా చేయకముందే తమ ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసినట్లు సందేశాలు రావడంతో బ్యాంకు అధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులు తిరుమలగిరి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపగా దుండగులు చేసి ఘనకార్యం బట్టబయలైంది. ఒకే రోజు 12 సార్లు దొంగతనం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దుండగులను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.70 వేల నగదుతో పాటు చోరీకి వినియోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులకు, వినియోగదారులకు తిరుమలగిరి ఏసీపీ రమేష్ సూచించారు.


ఇవి కూడా చదవండి

Robbery: ఇళ్లు అద్దెకు కావాలంటూ వచ్చి..ఏం చేశారంటే

Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 03 , 2025 | 04:32 PM