Metro Fare Rise: 10 నుంచి మెట్రో చార్జీల పెంపు
ABN , Publish Date - May 05 , 2025 | 03:33 AM
హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీల పెంపు త్వరలో అమలు కానుంది. 25-30% పెంపు కోసం ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతుంది, 10 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయి

25-30% పెంచేందుకు ఎల్అండ్టీ నిర్ణయం
అనుమతి కోసం 8న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ
కనిష్ఠంగా రూ.15.. గరిష్ఠంగా రూ.75 వరకు ఉండే చాన్స్
హైదరాబాద్ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర రవాణాలో అతి కీలకమైన మెట్రో రైలు టికెట్ చార్జీల పెంపు దాదాపుగా ఖరారైంది. ఛార్జీల పెంపుపై కొంతకాలంగా ఊగిసలాడుతున్న ఎల్ అండ్ టీ అధికారులు నష్టాలను నివారించుకునేందుకు ముందుకుసాగుతున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టికెట్ రేట్లు పెంచాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఆయన అనుమతి కోరనున్నారు. ఈ అంశం ఇప్పటికే సీఎం దృష్టిలో ఉండడంతో ఆయన సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో పెంచనున్న చార్జీలను ఈ నెల 10 నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో మొదటి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో 2012లో రూ.14,132కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబరులో పూర్తిచేశారు. మియాపూర్-ఎల్బీ నగర్, జేబీఎస్ -ఎంజీబీఎస్, నాగోలు-రాయదుర్గం మధ్య 69.2 కిలోమీటర్ల పరిధిలో పనులు పూర్తిచేశారు. ప్రస్తుతం రోజుకు 1,200సర్వీసులు నడుస్తుండగా 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
ఏడాదిన్నరగా యత్నాలు
కరోనాకు ముందు రోజుకు రూ.80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్చుకున్న సంస్థ.. తర్వాత నుంచి కుదేలైంది. 2020 నుంచి 2022 వరకు ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పాటు మాల్స్, ప్రకటనల నుంచి ఆశించిన ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కింద ప్రభుత్వం ఇచ్చిన 267 ఎకరాల భూమిలో కేవలం నాలుగైదు ప్రాంతాల్లోనే కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించింది. చాలావరకు భూములు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుండడంతో ఆ భారం కూడా మెట్రోపై పడిందని ఎల్ అండ్ టీ అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే టికెట్ రేట్ల సవరణపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్), అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబరులో ఎఫ్ఎఫ్సీని నియమించింది. ఆ కమిటీ నగరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి కేంద్రానికి నివేదిక సమర్పించింది. 2023 జనవరి నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రావడంతో ఆ విషయం మరుగునపడింది. అయితే చార్జీల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారు లు ఏడాదిన్నరగా యత్నిస్తున్నారు.
25 నుంచి 30 శాతం పెంపు!
ఎఫ్ఎఫ్సీ నివేదిక ఆధారంగా టికెట్ ఛార్జీలు పెంచుకునే స్వతంత్రత.. నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీకి ఉంటుందని ఆ సంస్థకు చెందిన ఓ ముఖ్య అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మెట్రో రైల్వే (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్ 2002 ప్రకారం టికెట్ రేట్లను సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది బెంగళూరు మెట్రో రైలులో ఎఫ్ఎ్ఫసీ ఆధారంగానే 50శాతం చార్జీలు పెంచారని, మన వద్ద 25 నుంచి 30 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఏటా రూ.150-170 కోట్ల వరకు వార్షిక ఆదాయం రాబట్టుకోవాలని ఆలోచిస్తున్నామని, తద్వారా నష్టాలను కొంతైనా తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.