Share News

Sperm Donation: బిర్యానీ పొట్లం, మందు బాటిల్‌‌‌తో ఎర.. చివరకు..

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:53 AM

బిచ్చగాళ్లకు బిర్యాని.. అడ్డా కూలీలకు మద్యం.. కొంచెం చదువుకున్న వారికైతే రూ. వెయ్యి నుంచి 4 వేలు! అదే మహిళలకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా ఇస్తారు

Sperm Donation: బిర్యానీ పొట్లం, మందు బాటిల్‌‌‌తో ఎర.. చివరకు..

  • వీర్యం, అండాల దందాలో వికృత పార్శ్వాలు

  • చదువురానివారికైతే.. బిర్యానీ పొట్లం, మందు బాటిల్‌

  • విద్యావంతులకు రూ.4వేల వరకు చెల్లించి వీర్యం సేకరణ

  • అండ దానం చేసే మహిళలకు 20-25 వేలు

  • పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): బిచ్చగాళ్లకు బిర్యాని.. అడ్డా కూలీలకు మద్యం.. కొంచెం చదువుకున్న వారికైతే రూ. వెయ్యి నుంచి 4 వేలు! అదే మహిళలకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా ఇస్తారు!! వీర్యం, అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది!! సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటివి కోరుకునేవారు.. ఆ దాతలు బాగా చదువుకున్నవారై, మంచి తెలివితేటలు కలిగినవారై ఉండాలని భావిస్తారు. కానీ.. ఈ దందా నడిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్లు, అడ్డాకూలీల వీర్యాన్ని, అండాలను! ‘ఇండియన్‌ స్పెర్మ్‌ టెక్‌ క్రయోసిస్టమ్‌ క్లినిక్‌’ పేరుతో సికింద్రాబాద్‌లో ఈ దందా నడుపుతున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. దీనిపై లోతైన దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఈ క్లినిక్‌ యజమాని, మేనేజర్‌గా వ్యవహరిస్తున్న పంకజ్‌ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా, టెక్నీషియన్‌లుగా నియమించుకున్నాడు. వారు.. బిచ్చగాళ్లకు, అడ్డాకూలీల వంటివారికి డబ్బు ఆశ చూపించి వారి నుంచి వీర్యం, అండాలను సేకరిస్తున్నారు.


ఆర్ట్‌ (అసిస్టెడ్‌ రీ ప్రొడక్టివ్‌ టెక్నాలజీ) నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి, అదీ 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్నవారి నుంచి.. వారికి అన్నిరకాల వైద్యపరీక్షలూ నిర్వహించి, ఎలాంటి జన్యువ్యాధులు, అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్ఠంగా 25సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి. కానీ.. స్పెర్మ్‌ క్లినిక్‌లు ఈ నిబంధనలన్నింటినీ తోసిరాజని ఒకే వ్యక్తి నుంచి వారానికొకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నాయి. ఉదాహరణకు.. ఇండియన్‌ స్పెర్మ్‌టెక్‌ ఏజెంట్లు బిచ్చగాళ్లు, అడ్డాకూలీలను సంప్రదించి.. ‘‘వారానికోసారి ఇక్కడకు వచ్చి మేం చెప్పినట్లు చేస్తే మందుతో పాటు బిర్యానీ ఇప్పిస్తామ’’ంటూ వారికి ఆశపెట్టేవారని తెలిసింది. లేదంటే వాటికి సరిపడా రూ 500-1000 చేతిలో పెట్టి పంపేవారని సమాచారం. అలా వచ్చేవారు.. తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే.. వారి నుంచి అండాలు సేకరించేవారు. అది కొంచెం కష్టమైన పని కావడంతో మహిళలకు ప్రతిసారీ రూ.20 వేల నుంచి రూ.25 వేలు చెల్లించేవారని తెలిసింది. నిందితులను మరోసారి కస్టడీకి తీసుకొని విచారించేందుకు గోపాలపురం పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిసింది.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 07:51 AM