Crop Loss: చేతికొచ్చిన పంటలను ముంచిన వాన
ABN , Publish Date - May 03 , 2025 | 04:11 AM
రాష్ట్రంలో ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భానుడు నిప్పులు కక్కుతుండగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వరుణుడు పలకరిస్తున్నాడు.

పలు జిల్లాల్లో వరి, మిర్చి, మామిడికి నష్టం
భూపాలపల్లి కాటారంలో 4సెం.మీ. వాన
ఇప్పటిదాకా 25 వేల ఎకరాల్లో పంట నష్టం: మంత్రి తుమ్మల
ఆదిలాబాద్ బేలలో 44.7 డిగ్రీల ఎండ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): రాష్ట్రంలో ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భానుడు నిప్పులు కక్కుతుండగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వరుణుడు పలకరిస్తున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. భూపాలపల్లి జిల్లా కాటారంలో 4 సెం.మీ. వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అకాల వర్షాలతో అతలాకుతలం
భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మలహర్, మహాముత్తారం, ఘనపురం మండలాల్లో గురువారం రాత్రి కురిసిన వర్షాలు భీభత్సం సృష్టించాయి. కాటారంలో అత్యధికంగా 4సెం.మీ. వర్షం కురిసింది. కాటారం, మహా ముత్తారం మండలాల్లో పెనుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరి, మొక్కజొన్న పంటలు నేలవాలగా, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. మహాదేవపూర్లో కొనుగోలు కేంద్రంలోని ధాన్యంతోపాటు కల్లాల్లో ఆరబెట్టిన మిరప పంట వరదకు కొట్టుకుపోయింది. గణపురం మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో ఒక ఇల్లు ధ్వంసం కాగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 5వేల టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, బయ్యారం, కురవి, డోర్నకల్, గార్ల మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల 150 ఎకరాల మామిడితోటకు నష్టం వాటిల్లింది. గాలివాన ఉధృతికి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయిలో 1200 ఎకరాల వరి పంట దెబ్బతింది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి, చెన్నారావుపేట మండలాల్లో కోత దశకు వచ్చిన వరి పంట నేలవాలింది. ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలంలో 3.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కూసుమంచి మండలంలో ఈదురుగాలులకు మామిడి కాయలు పెద్ద ఎత్తున నేల రాలాయి. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని సోలీపూర్, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని 12 కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన వంద టన్నుల ధాన్యం తడిసి ముద్దయింది. బాదేపల్లి మార్కెట్లో 11వేల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. మంచిర్యాల జిల్లాలోని భీమారం, జైపూర్ మండలాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. చెన్నూరు మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. పెద్దపల్లి జిల్లాలోని ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆరెంద, గోపాల్పూర్, ఎక్లా్సపూర్, నాగెపల్లి, అడవిసోమన్పల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
రాష్ట్రంలో 25వేల ఎకరాల్లో పంటనష్టం
రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో 25 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం అందిందని, ఈ విషయమై కలెక్టర్లను నివేదికలు అడిగామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున తాత్కాలిక సాయం అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా రఘునాఽథపాలెం మండలం సూర్యతండాలో దెబ్బతిన్న బొప్పాయి, ఇతర పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు.
హైదరాబాద్లో వడగాడ్పులు
హైదరాబాద్లో వడగాలులు మంట పుట్టిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం 41-42 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతిచెందారు. ఖమ్మం రూరల్ పరిధిలోని ఆరెంపుల గ్రామంలో దోరెపల్లి శ్రీను(55), పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన మరకాల శ్రీనివాసరావు(40) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో 41.1, గద్వాల జిల్లాలో 41.1. మహబూబ్నగర్ జిల్లాలో 39.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News