Share News

ఘోస్ట్‌ ఫ్యాకల్టీ పద్ధతి మంచిది కాదు

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:10 AM

ప్రైవేటు వైద్య కళాశాల్లో ఘోస్ట్‌ ఫ్యాకల్టీ (పేరుకే కాగితాల్లో ఉంటూ విధులు నిర్వహించని అధ్యాపకులు) పద్ధతి మంచిది కాదు. దీని వల్ల వైద్య విద్య ప్రమాణాలు దిగజారుతాయి.

ఘోస్ట్‌ ఫ్యాకల్టీ పద్ధతి మంచిది కాదు

  • వైద్య విద్యలో ప్రమాణాలు తగ్గితే ప్రాణాలకే ముప్పు

  • నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు

  • ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు మంత్రి దామోదర హెచ్చరిక

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రైవేటు వైద్య కళాశాల్లో ఘోస్ట్‌ ఫ్యాకల్టీ (పేరుకే కాగితాల్లో ఉంటూ విధులు నిర్వహించని అధ్యాపకులు) పద్ధతి మంచిది కాదు. దీని వల్ల వైద్య విద్య ప్రమాణాలు దిగజారుతాయి. వైద్య విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గితేప్రజల ప్రాణాలకే ముప్పు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. సోమవారం ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు, డీన్స్‌, ప్రిన్సిపాళ్లతో సచివాలయంలో మంత్రి సమావేశమయ్యారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో విద్యలో నాణ్యత ప్రమాణాలు, ఎన్‌ఎంసీ నిబంధనలు, అధ్యాపకులు, హాజరు, ఫీజులు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ డాక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ప్రపంచంలోని ఎన్నో ప్రఖ్యాత మెడికల్‌ ఇనిస్టిట్యూట్లను ఇక్కడ చదివిన వైద్యులు నడిపిస్తున్నారు. ఇక్కడి వైద్య విద్య ప్రమాణాల వల్లే అది సాధ్యమైంది. పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ చెల్లించే విషయంలో కొన్ని కాలేజీలపై ఫిర్యాదులు వస్తున్నాయి. పిల్లలకు కచ్చితంగా స్టైపెండ్‌ చెల్లించాలి. కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధన ఆస్పత్రుల్లో క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అదనపు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టినా, అడ్వాన్స్‌గా ఫీజులు కట్టాలని ఒత్తిడి చేసినా ఉపేక్షించేది లేదు’ అని మంత్రి స్పష్టం చేశారు. ఎన్‌ఎంసీ నిబంధనల విషయంలో కాలేజీలు లేవనెత్తిన సమస్యలను ఎన్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని హమీనిచ్చారు.


వడదెబ్బ బారినపడితే 108కి సమాచారమివ్వాలి

వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్‌ను మెడికల్‌ కార్పొరేషన్‌ (టీజీఎంఎ్‌సఐడీసీ) కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఎండలు ముదురుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే సమీప ఆస్పత్రికి బాధితులను తరలించాలని, 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. వడదెబ్బపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల వరకూ అన్నింట్లో వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి

BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం

Cybercrime: సైబర్‌ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 22 , 2025 | 03:10 AM