Share News

మహిళా సమాఖ్యలకు రోగుల ‘డైట్‌’ బాధ్యత

ABN , Publish Date - Jun 05 , 2025 | 03:47 AM

ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రోగులకు ఆహారం అందించే విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు మెనూ ప్రకారం ఆహారం సరఫరా చేయని కాంట్రాక్టర్లపై వేటు వేయనుంది.

మహిళా సమాఖ్యలకు రోగుల ‘డైట్‌’ బాధ్యత

  • మెనూ అమలు చేయని కాంట్రాక్టర్లపై వేటు

  • బోధనాస్పత్రుల అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రోగులకు ఆహారం అందించే విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు మెనూ ప్రకారం ఆహారం సరఫరా చేయని కాంట్రాక్టర్లపై వేటు వేయనుంది. ఆ కాంట్రాక్టర్ల స్థానంలో మెనూ అమలు చేసే బాధ్యతను జిల్లా మహిళా సమాఖ్యలకు అప్పగించనుంది. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైట్‌ అమలుపై విజిలెన్స్‌ నివేదికలు, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్యవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 110 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరీక్షించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కొద్ది రోజుల క్రితం 10 విజిలెన్స్‌ బృందాలను రంగంలోకి దించింది. ప్రభుత్వం సూచించిన మెనూ పాటించకపోవడం, అపరిశుభ్రమైన వంట గదులు వంటివి విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగు చూశాయి.


ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విజిలెన్స్‌ బృందాలు డైట్‌ కాంట్రాక్టర్లను మూడు విభాగాలుగా విభజించాయి. రోగులకు మెనూ ప్రకారం భోజనం అందించేవారు, అసలు మెనూ పాటించని వారు, కాంట్రాక్టు ముగిసినా పొడిగింపుపై కొనసాగుతున్నవారు అని వేరు చేశాయి. మెనూ పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టు ముగిసిన వారి స్థానాలను కొత్తవారితో భర్తీ చేయాలని విజిలెన్స్‌ బృందాలు సిఫారసు చేశాయి. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు డైట్‌ అమలు చేయని కాంట్రాక్టర్లను తక్షణమే తొలగించబోతున్నారు. డైట్‌ కాంట్రాక్టు కాల పరిమితి ముగిసినా.. కొన్ని ఆస్పత్రుల్లో ప్రస్తుతం పాతవారే ఇంకా కొనసాగిస్తున్నారు. అలాంటి వారిని కూడా వెంటనే తొలగించాలని డీఎంఈ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. డైట్‌ కాంట్రాక్టులు ముగిసిన చోట, తొలగించిన చోట స్థానిక మహిళా సమాఖ్యలకు బాధ్యతలు అప్పజెప్పాలని సూచించారు. ఈ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా వారిని ప్రోత్సహించినట్టు అవుతుందని ప్రభుత్వ ఆలోచన.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 03:47 AM