Government Hospitals: రోగులకు అరకొర భోజనం
ABN , Publish Date - May 27 , 2025 | 04:27 AM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకిచ్చే ఆహారంలో నాణ్యత ఉండటం లేదు. నిబంధనల మేరకు తగినంతగా భోజనం ఇవ్వడం లేదు. మానసిక రోగులు, దివ్యాంగులకు అసలు తిండి పెట్టడం లేదు.

ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యత లేని ఆహారం వడ్డింపు
రోజూ ఒకే తరహా భోజనం.. ఉదయం ఉప్మానే
వంటశాలలో ఎలుకలు, బొద్దింకలు, అపరిశుభ్రత
మానసిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు నో డైట్
డైట్ కాంట్రాక్టర్లపై సర్కారుకు విజిలెన్స్ నివేదిక
వైద్య మంత్రి సీరియస్.. డైట్ కాంట్రాక్టుల రద్దు
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకిచ్చే ఆహారంలో నాణ్యత ఉండటం లేదు. నిబంధనల మేరకు తగినంతగా భోజనం ఇవ్వడం లేదు. మానసిక రోగులు, దివ్యాంగులకు అసలు తిండి పెట్టడం లేదు. రోజూ కోడి గుడ్లు ఇవ్వాలన్న విషయాన్ని మరచిపోయారు. రోగులకిచ్చే పండ్లు కుళ్లిపోయి ఉంటున్నాయి. వంటశాలలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. కొన్నిచోట్ల బొద్దింకలు, ఎలుకలు దర్శనమిస్తున్నాయి. రోజూ ఉదయం ఉప్మా తప్ప వేరే అందించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారీ దవాఖానాల్లో రోగులకు అందించే ఆహారంపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. దీంతో వైద్య విద్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని బోధనాస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేశాయి. తాజాగా సర్కారుకు విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా చోట్ల డైట్ కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు తేలింది. అలాగే రెండేళ్ల కాల పరిమితికి కాంట్రాక్టు ఇస్తే.. చాలా చోట్ల అంతకు మించి కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఈ నివేదికపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెండు రోజుల క్రితం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణమే డైట్ కాంట్రాక్టులను రద్దు చేయాలని ఆదేశించారు. కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
సిఫారసులు ఇవే..
నిబంధనలు పాటించని డైట్ కాంట్రాక్టర్లను తక్షణమే తొలగించాలి. కాల పరిమితి ముగిసిన వారికి ఎక్స్టెన్షన్ ఇవ్వొద్దు. డైట్ కాంట్రాక్టులో ఈ-టెండర్ విధానాన్ని పాటించాలి. డైట్ చార్జీలను పెంచాలి. రోజూ రోగులకిచ్చే ఆహార పదార్థాల నమూనాలను సేకరించాలి. భోజనం చేసిన తర్వాత రోగుల అభిప్రాయాన్ని తీసుకోవాలి. డైట్ కాంట్రాక్టర్లకు ఫుడ్, లేబర్ లైసెన్స్లను తప్పనిసరి చేయాలి. రోగులకు ఇచ్చే ఆహార పదార్థాల జాబితాను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి. ట్రాలీలో భోజనం తీసుకువచ్చి అందించే బదులు ప్యాక్ చేసి ఇవ్వాలి. నిబంధనల మేరకు ఆహార సరఫరా చేయని కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయాలి. అలాగే, ప్రతి బోధనాస్పత్రిలో విధిగా డైటీషియన్ పోస్టులను మంజూరు చేయాలి. ఆహార పదార్థాల విషయంలో ఏమైనా ఫిర్యాదులుంటే తెలియజేసేందుకు రోగుల కోసం ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలి.
తనిఖీల్లో తేటతెల్లం..
జగిత్యాల బోధనాస్పత్రిలో వంటశాల బాగా ఇరుకుగా, అపరిశుభ్రంగా ఉంది. భోజనంపై రోగులు సంతృప్తిగా లేరు. రోగులందరికీ ఒకే రకమైన ఆహారాన్ని ఇస్తున్నారు. సిరిసిల్ల బోధనాస్పత్రిలో రోగులకు ఇచ్చే భోజనాన్ని తనిఖీ చేయకుండానే ఇస్తున్నారు. ఆ డైట్పై రోగులెవ్వరూ సంతృప్తిగా లేరు. వంటగది సరిపోయేంత లేదు. రామగుండం టీచింగ్ ఆస్పత్రిదీ అదే పరిస్థితి.
మహబూబ్నగర్ బోధనాస్పత్రిలో సరైన భోజనం అందించడం లేదు. రోగుల దగ్గరికి వెళ్లి భోజనం ఇవ్వడం లేదు. ఆహార నాణ్యత, పరిమాణం తగినంతగా ఇవ్వడం లేదు. మానసిక, దివ్యాంగులకు అసలు భోజనమే పెట్టడం లేదని తేలింది. అటువంటి రోగులకు సహాయకులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు వారిని పట్టించుకోవడం లేదు. విజిలెన్స్ అధికారులు తక్షణమే డైట్ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని సిఫారసు చేశారు. నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ బోధనాస్పత్రుల్లోనూ ఇదే తంతు. నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదు. మెనూలో సూచించిన విధంగా అన్ని రకాల ఆహార పదార్థాలను ఇవ్వడం లేదు.
పెద్దపల్లి, మంథని, కోరుట్ల, ధర్మపురి ఆస్పత్రుల్లో విజిలెన్స్ సర్వేలో రోగులు అసంతృప్తి తెలిపారు.
సత్తుపల్లి ఆస్పత్రిలో రోగులకు తాజా ఆహారాన్ని ఇవ్వడం లేదు. అలాగే సరిపోయేంత కూడా అందించడం లేదని రోగులు ఫిర్యాదు చేశారు. బయట వండిన ఆహారాన్ని వడ్డిస్తున్నారు.
హైదరాబాద్ సుల్తాన్బజార్ మెటర్నిటీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా ఒకే తరహా భోజనం పెడుతున్నారు. పెరుగు, చపాతీ, ఇవ్వడం లేదు. నాణ్యత లేని పాలు అందిస్తున్నారు. రోగులందరికీ ఒకేవిధమైన ఆహారం పెడుతున్నారు. రోగులకు పెట్టే భోజనాల సంఖ్యకు, రికార్డుల్లో రాసే వాటికి బోలెడంత వ్యత్యాసం. ఆహారంలో నాణ్యత లేదు. డైట్ రికార్డులను తనిఖీ చేయాల్సిన ఆర్ఎంవోలు వాటిని అసలు చూడటమే లేదు.
కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో మెనూ పాటించడం లేదు. వంటగదిలో డ్రైనేజీ పొంగుతోంది.
పేట్లబుర్జు ఆస్పత్రిలో ఆహార నాణ్యత బాగున్నా, ఇండెంట్ పుస్తకాలు సరిగా నిర్వహించడం లేదు.
సరోజిని కంటి దవాఖానా, నాంపల్లి, గోల్కొండ, మలక్పేట్ ఏరియా ఆస్పత్రుల్లో డైట్ మెనూ పాటించడం లేదు. వంట గదుల్లో ఎలుకలు పరుగెడుతున్నాయి. పారిశుధ్యం లోపించింది. వాష్ ఏరియాలో డ్రైనేజీ లీక్ అవుతోంది. నిలోఫర్ ఆస్పత్రిలో అసలు మెనూనే పాటించడం లేదు. డైట్ నమూనాలు నమోదు చేయడం లేదు.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఆస్పత్రిలో రోగులందరికీ రోజూ ఒకే తరహా ఆహారం ఇస్తున్నారు. భోజనంలో కూర, గుడ్డు, పెరుగు లేదు. కేవలం పప్పన్నం పెడుతున్నారు. అదే జిల్లా ఉట్నూరు ఏరియా ఆస్పత్రిలో కూడా మెనూ పాటించడం లేదు. వంటగది అపరిశుభ్రంగా ఉంది.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..