దాబాలో పనిచేస్తూ కోట్లకు పడగలు?
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:13 AM
వికాస్ సాహూ.. ఆరేళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చి, చిన్న పనికి కుదిరి.. ఇప్పుడు కోట్ల రూపాయల డ్రగ్స్ దందా చేస్తున్నాడు.

ప్రతినెల కోట్లలో ‘మత్తు’ వ్యాపారం
సంజూదాబా కేసులో మధ్యప్రదేశ్కు ప్రత్యేక బృందాలు
డ్రగ్స్ మూలాలపై బృందాల నజర్
హవాలా కోణంలోనూ విచారణ
వికాస్ కస్టడీకి రేపు కోర్టులో పిటిషన్
షాద్నగర్, మే 31 (ఆంధ్రజ్యోతి): వికాస్ సాహూ.. ఆరేళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చి, చిన్న పనికి కుదిరి.. ఇప్పుడు కోట్ల రూపాయల డ్రగ్స్ దందా చేస్తున్నాడు. 2019లో షాద్నగర్ శివార్లలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద ఉన్న సంజూభాయ్ దాబాలో నైట్ వాచ్మన్గా చేరాడు. క్రమంగా అదే దాబాలో వంటమనిషిగా పనిచేశాడు. యజమాని సంజూభాయ్ మరణం తర్వాత.. ఏకంగా ఓనరైపోయాడు. సైడ్ బిజినెస్-- డ్రగ్స్ దందాతో రూ.కోట్లలో సంపాదించాడు. అడ్డదారుల్లో వికాస్ ఎదిగిన తీరును చూసి, షాద్నగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్వోటీ బృందాలు అవాక్కవుతున్నాయి. వికాస్ తన స్వస్థలమైన మధ్యప్రదేశ్లోని రాజస్థాన్లో ఆస్తులు కూడగట్టినట్లు గుర్తించారు. దాంతో.. తదుపరి దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలను అక్కడకు పంపారు. షాద్నగర్ కేంద్రంగా వికాస్ ప్రతినెల రూ.కోట్లలో డ్రగ్స్ దందా చేసేవాడని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. దీంతో ఎస్వోటీ బృందాలు వికాస్ సెల్ఫోన్ కాల్ డేటా రికార్డ్(సీడీఆర్) ఆధారంగా అతని కాంటాక్టులను పరిశీలిస్తున్నారు. వాట్సా ప్ చాటింగ్ డేటాను రిట్రీవ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
చాటింగ్ వివరాలు వెల్లడైతే.. వికాస్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న కస్టమర్లు ఎవరు? హెరాయిన్, నల్లమందు, గంజాయి వంటి మత్తుపదార్థాలు అతనికి సరఫరా చేస్తున్నదెవరు? అనేది తేలుతుందని దర్యాప్తులో పాలుపంచుకుంటున్న ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘‘ప్రాథమిక దర్యాప్తులో ఇతను మధ్యప్రదేశ్ నుంచి డ్రగ్స్ను తెప్పించి, షాద్నగర్తోపాటు.. హైదరాబాద్లోని జల్పల్లి, ధూల్పేటలోని విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఇతణ్ని కస్టడీలోకి తీసుకునేందుకు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం. కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని, విచారిస్తే.. డ్రగ్స్ మూలాలు బయటపడే అవకాశాలున్నాయి’’ అని ఆ అధికారి వివరించారు. అతణ్ని కస్టడీకి తీసుకుంటే.. బ్యాంకు ఖాతాలు, లాకర్ వివరాలు, వికాస్ తన భార్య పేరిట కొనుగోలు చేసిన ఆస్తుల సమాచారాన్ని సేకరించే అవకాశాలున్నాయి. డ్రగ్స్ దందాలో సంపాదించిన మొత్తాన్ని మధ్యప్రదేశ్కు తరలించడానికి హవాలా మార్గాన్ని ఎంచుకున్నాడా? డ్రగ్స్ మూలాలెక్కడున్నాయి? అనే ప్రశ్నలను వికా్సపై సంధించనున్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో.. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ-న్యాబ్) అధికారులు, అంతర్రాష్ట్ర డ్రగ్స్ దందా కావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. వికాస్ డ్రగ్స్ దందాపై షాద్నగర్ పోలీసులు మూణ్నెళ్లుగా మఫ్టీలో నిఘా పెట్టారు. లుంగీలపై.. లారీ డ్రైవర్ల మాదిరిగా దాబా పరిసరాల్లో మకాం వేశారు. పక్కాగా ఆధారాలను సేకరించాక.. అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News