MLA Naveen Ydav: గల్లీ కుర్రోడు.. ఎమ్మెల్యే అయ్యాడు!
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:22 AM
యూసుఫ్గూడ గల్లీలో పెరిగిన కుర్రాడు. ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు. మొదట సొంత వ్యాపారం వైపు మొగ్గు చూపించాడు. తన ఇంట్లో ఎవరో ఒకరు రాజకీయంగా ఎదగాలని అతడి నాన్న భావించేవారు. తండ్రి ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
- వ్యక్తిత్వంపై దాడి చేసినప్పుడల్లా పెరిగిన పట్టుదల
- మూడోసారి పోటీలో వరించిన విజయం
- తండ్రి కోరికను తీర్చిన తనయుడు
హైదరాబాద్: యూసుఫ్గూడ(Yusufguda) గల్లీలో పెరిగిన కుర్రాడు. ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు. మొదట సొంత వ్యాపారం వైపు మొగ్గు చూపించాడు. తన ఇంట్లో ఎవరో ఒకరు రాజకీయంగా ఎదగాలని అతడి నాన్న భావించేవారు. తండ్రి ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సమయం, సందర్భంగా కలిసి రాకపోవడంతో రెండు మార్లు పరోక్షంగా, మరో రెండు సార్లు ప్రత్యక్షంగా ఓటమి చూశాడు. అయినా ప్రయత్నాలు వీడలేదు. కుటుంబ వ్యక్తిత్వంపై పదే పదే దాడి జరిగినా చెరగని చిరునవ్వుతో అందరికీ దగ్గరయ్యాడు.

ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజేత వి. నవీన్యాదవ్(V. Naveen Yadav) యూసుఫ్గూడకు చెందిన చిన్న శ్రీశైలంయాదవ్, కస్తూరి యాదవ్లకు నలుగురు సంతానం. పెద్ద కుమారుడు నవీన్యాదవ్ యుక్త వయసు నుంచే రాజకీయాల్లో చురుగా పాల్గొన్నాడు. తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ పీజేఆర్ ప్రధాన అనుచరుడిగా ఎదిగారు. అనంతరం రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరి 1999లో అప్పటి ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్టు ఆశించినా దక్కలేదు.
తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కేసీఆర్ స్థాపించిన అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. 2001లో గ్రేటర్ ఎన్నికల్లో చిన్న శ్రీశైలంయాదవ్, ఆయన భార్య టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ టికెట్టు తీసుకొని పోటీ చేసి పరాజయం పొందారు. అంతే కాకుండా ఈ ప్రయాణంలో ఆయనపై పలు కేసులు నమోదు కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తండ్రి కోరిక తీర్చేందుకు..
కేసుల విషయంలో ఇబ్బంది పడ్డ చిన్న శ్రీశైలంయాదవ్ ఎప్పటికైనా తన ఇంట్లో వ్యక్తి రాజకీయంగా ఎదగాలని భావించేవాడు. ఇదే విషయాన్ని తరుచూ పిల్లలతో అనేవాడు. నవీన్యాదవ్కు తండ్రి కోరిక తీర్చాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే ఆర్కిటెక్చర్ పూర్తి చేసిన నవీన్యాదవ్ సొంతంగా కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తూ మరో వైపు నవనిర్మాణ్ సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
2007లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని భావించి ఎంఐఎం టికెట్ సాధించగలిగారు. స్కూృట్నీలో సాంకేతిక సమస్య కారణంగా నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయినా నీరు గారి పోకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ 2014లో ఎంఐఎం తరఫున పోటీ చేశారు. త్రిముఖ పోటీలో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 9 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. 2018లో ఎంఐఎం నుంచి మరోసారి టికెట్టు ఆశించగా పార్టీ నిరాకరించింది.
దీంతో ఇండిపెండెంట్గా బరిలో దిగి సుమారు 24 వేల ఓట్లు సాధించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్టు కోసం ప్రయత్నించారు. టికెట్టు దాదా పు ఖరారు అయ్యే సమయంలో అజారుద్దీన్ను ఏఐసీసీ ప్రతిపాదించడంతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుతం సీఎం రేవంత్ హామీ మేరకు విత్డ్రా చేసుకొని కాంగ్రెస్ కోసం పనిచేశారు. ఇంతలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీని తట్టుకొని టికెట్టు తెచ్చుకోవడంతో పాటు విజయం సాధించారు. ఎమ్మెల్యే అయి తండ్రి కోరిక తీర్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక
Read Latest Telangana News and National News