ACB Raids: మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:41 AM
ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని రెండు మున్సిపాలిటీల్లో గురువారం నిర్వహించిన వేరువేరు దాడుల్లో లంచం తీసుకుంటూ నలుగురు ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్గా దొరికారు.

లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా చిక్కిన నలుగురు ఉద్యోగులు
శామీర్పేట, నిర్మల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని రెండు మున్సిపాలిటీల్లో గురువారం నిర్వహించిన వేరువేరు దాడుల్లో లంచం తీసుకుంటూ నలుగురు ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్తో పాటు, నిర్మల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇన్చార్జి ఆర్ఐ, ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి తూంకుంట మున్సిపాలిటీలోని శామీర్పేట వార్డు పరిధిలో రెండు ఇళ్లను కొనుగోలు చేశాడు. వాటి మ్యుటేషన్ కోసం మున్సిపల్ కార్యాలయంలో ఏడాది క్రితం అర్జీ పెట్టుకున్నాడు. అందుకోసం శామీర్పేట వార్డు కార్యాలయంలోని సీనియర్ బిల్ కలెక్టర్ రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రవణ్ రూ.20 వేలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. లంచం ఇస్తేనే మ్యుటేషన్ చేస్తామని వేధించారు.
దీంతో విసుగు చెందిన ఇంటి యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు ఉద్యోగులకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి సంబంధించి అసెస్మెంట్ కోసం ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులను సంప్రదించాడు. అందుకోసం రూ.6 వేలు లంచం ఇవ్వాలని కార్యాలయంలో ఇన్చార్జి ఆర్ఐగా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గైక్వాడ్ సంతోష్, అతని వద్ద అసిస్టెంట్గా పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి షోయబ్ అహ్మద్ డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు వ్యక్తి.. ఆ విషయమై రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు ఇంటి యజమాని లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News