Share News

Maoist: 42 నుంచి 16కి..

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:29 AM

బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నర్సింహాచలం అలియాస్‌ సుధాకర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ నలుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.

Maoist: 42 నుంచి 16కి..

  • తగ్గిపోతున్న మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల సంఖ్య

  • 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది

  • ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో తగ్గిన సభ్యులు

  • ఈ ఏడాదే ఎన్‌కౌంటర్లలో నలుగురు మృతి

  • మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే

  • కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపికపై నిఘా వర్గాల ఆరా

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నర్సింహాచలం అలియాస్‌ సుధాకర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ నలుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నారు. 2004లో నాటి పీపుల్స్‌వార్‌, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ కలిసి మావోయిస్టు పార్టీగా ఏర్పడినపుడు 42 మందితో కేంద్రకమిటీ ఏర్పాటైంది. ఈ 21 ఏళ్లలో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, సహజమరణాలతో కేంద్ర కమిటీలోని సభ్యుల సంఖ్య 16కి తగ్గిపోయింది. రెండు దశాబ్దాల ప్రస్థానంలో మావోయిస్టు పార్టీ మధ్యభారతంలోని కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో జనతన సర్కార్‌ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. అబూజ్‌మడ్‌ వంటి కంచుకోటలను ఏర్పాటు చేసుకుని నాయకులను, క్యాడర్‌ను కాపాడుకుంది. కానీ, ప్రస్తుతం కేంద్రప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్‌ కగార్‌తో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యారు. వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో కీలక నాయకులు కూడా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో ఛత్తీ్‌సగఢ్‌, ఓడిశా సరిహద్దుల్లోని కుల్హదీఘూట్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడైన రామచంద్రారెడ్డి అలియాస్‌ జయరాం, అలియాస్‌ చలపతి మరణించారు. ఆ తర్వాత మే నెలలో బీజాపూర్‌ జిల్లా ఉసూర్‌ సమీపంలోని లంకపల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న మరణించారు. అదే నెలలో నారాయణపూర్‌లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఏకంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎన్‌కౌంటర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి మరణించటం ఇదే ప్రథమం. ఆ ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతోపాటు 27 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు, ఏపీకి చెందిన తెంటు నర్సింహాచలం అలియాస్‌ సుధాకర్‌ (64) చనిపోయారు. ఈ విధంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్లలో మరణించారు.


మిగిలింది 16 మంది

కేంద్ర కమిటీలో ప్రస్తుతం 16 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 11 మంది కాగా, జార్ఖండ్‌కు చెందినవారు ముగ్గురు, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన వారు ఇద్దరున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన వారు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్‌ సోనూ, తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ కోసా, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి, మోడెం బాలకృష్ణ, పాక హన్మంతు అలియాస్‌ ఊకే గణేష్‌, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ రాజుదాదా, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, పసునూరి నరహరి అలియాస్‌ విశ్వనాఽథ్‌, పోతుల కల్పన. జార్ఖండ్‌కు చెందిన వారు మిసిర్‌ బెస్రా అలియాస్‌ సునీల్‌, అనల్‌ దా అలియాస్‌ పాతిరాం మాంజీ, సహదేవ్‌ అలియాస్‌ అనూజ్‌. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన వారు మాజ్జీదేవ్‌ అలియాస్‌ రాంధీర్‌, మాడ్వి హిడ్మా. వీరిలో పలువురు 60 ఏళ్లకు పైబడినవారే. కాగా, కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎవర్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తారని పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 03:29 AM