Mahabubnagar: జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:29 AM
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు సోమవారం ఇన్ఫ్లోలు పెరిగాయి. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టులో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

నారాయణపూర్లో రెండు గేట్లు ఎత్తివేత
హైదరాబాద్, ధరూరు/దోమలపెంట, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు సోమవారం ఇన్ఫ్లోలు పెరిగాయి. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టులో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయంలో ఇన్ఫ్లోలు పెరగడంతో 317.780 మీటర్లకు 8.184 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా జెన్కో జలవిద్యుత్ కేంద్రానికి 23,957 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ 2.702 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 25,835 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టులోకి 35,796 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను 842.40 అడుగుల్లో 65.4574 టీఎంసీల నీటి నిల్వ నమోదు అయినట్లు డ్యాం అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 9 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... 1,954 క్యూసెక్కులు జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా, 900 క్యూసెక్కులను కాలువ ద్వారా వదులుతున్నారు. ఇక గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వరద స్వల్పంగానే వస్తోంది.