Thummala: వరి నాట్లు వేసే నాటికి రైతు భరోసా
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:00 AM
వరి నాట్లు వేసే నాటికి రైతులందరికీ రైతు భరోసా అందించి తీరతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ‘రైతు సంక్షోభం’
అప్పులన్నీ తీర్చుతూ వ్యవస్థలను చక్కదిద్దుతున్నాం: మంత్రి తుమ్మల
ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/హైదరాబాద్, జూన్ 2 : వరి నాట్లు వేసే నాటికి రైతులందరికీ రైతు భరోసా అందించి తీరతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. వారి ఇంటిలో కుంపటి ఆర్పుకోలేక తమపై విమర్శలు చేస్తే.. తాము అంతకు రెండింతలు విమర్శించి తీరతామని అన్నారు. గత పాలకులు రైతు రుణమాఫీ ఎలా చేశారో రైతులకు తెలుసని, వారి పాపాలతో గత ఐదేళ్లు రైతు సంక్షేమ పథకాలు మట్టిపాలయ్యాయని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలు, సంస్థలను అప్పుల్లోకి నెట్టి వెళ్లిపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులన్నీ తీర్చుతూ, వ్యవస్థలను చక్కదిద్దుతూ రైతు సంక్షేమాన్ని గాడిలో పెట్టిందన్నారు ఒకేసారి రూ.35వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్రెడ్డి ప్రభుత్వానిదని గుర్తుచేశారు. కేంద్రం నుంచి పథకాలు తెచ్చుకోకుండా, నిధులు రాకుండా చేశారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్ర పథకాలను గాడిలో పెట్టామని, రైతులకు బిందుసేద్యం వంటి పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నిర్వాకంతో రైతు సంక్షేమం దెబ్బతిన్నదని, విత్తన సంస్థలకు రూ.350కోట్లు అప్పులుపెడితే తామే వాటిని తీర్చామని తుమ్మల తెలిపారు.
బీఆర్ఎస్ది మాటల సర్కారు
బీఆర్ఎ్సది మాటల ప్రభుత్వమైతే తమది చేతల ప్రభుత్వమని మంత్రి తుమ్మల విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఎగ్గొట్టిన రైతు బంధును తాము వచ్చాక రూ.7,600 కోట్లు చెల్లించామని తెలిపారు. పంట నష్టం సంభవించినపుడు రైతులను కనీసం పరామర్శించలేదని గత సర్కారును విమర్శించారు. రైతుబంధు పేరు చెప్పి వ్యవసాయ యాంత్రీకరణ, పంటల బీమా, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలను అటకెక్కించారని మండిపడ్డారు. రుణమాఫీ సగం మందికే చెల్లించారని ఆరోపించారు. తాము రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. గత సర్కారు వరి వేస్తే ఉరి అని భయపెడితే.. తాము సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, రైతులందరికీ డ్రిప్ పరికరాల అందజేత, విత్తన సబ్సిడీ, అన్ని పంటలకు మద్దతు ధర, శిక్షణ కార్యక్రమాలు, మట్టి నమూనా పరీక్షలు, ఇలా అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తుమ్మల ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News