అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:20 AM
పంట దిగుబడి సరిగా రాక, అప్పుల బాధ భరించలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పౌనూరు గ్రామానికి చెందిన రైతు మంతెన కుమార్ (39) తనకున్న రెండెకరాల పొలంలో వరి పండిస్తున్నాడు.

పొలంలో విద్యుదాఘాతంతో రైతు మృతి
మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో ఘటనలు
జైపూర్, పెద్దశంకరంపేట, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): పంట దిగుబడి సరిగా రాక, అప్పుల బాధ భరించలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పౌనూరు గ్రామానికి చెందిన రైతు మంతెన కుమార్ (39) తనకున్న రెండెకరాల పొలంలో వరి పండిస్తున్నాడు. గతేడాది రెండు సార్లు బోర్లు వేయించినా నీరు పడలేదు. మూడేళ్లుగా ప్రతికూల పరిస్థితులతో దిగుబడి తగ్గి రూ4 లక్షల వరకు అప్పులయ్యాయి. ఓ వైపు పంట చేతికి అందకపోవడం మరోవైపు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురై శనివారం రాత్రి పురుగు మందు తాగాడు.
కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం మక్తలక్ష్మాపూర్కు చెందిన నాగ్ధర్ బేతయ్య (50) ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. పంటను రక్షించుకునేందుకు బేతయ్య విద్యుత్ వైర్లతో పొలం చుట్టూ కంచెను ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి బేతయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.