Etela Rajender: రియల్ ఎస్టేట్ సిబ్బందిపై దాడి కేసు కొట్టేయండి
ABN , Publish Date - Jan 28 , 2025 | 03:32 AM
రియల్ ఎస్టేట్ కంపెనీ సిబ్బందిపై దాడి చేశారనే ఆరోపణలపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టులో ఎంపీ ఈటల క్వాష్ పిటిషన్
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రియల్ ఎస్టేట్ కంపెనీ సిబ్బందిపై దాడి చేశారనే ఆరోపణలపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈటల తరఫున న్యాయవాది లింగం దివాకర్రావు వాదిస్తూ... ప్లాట్ల కబ్జాలను అడ్డుకుని బాధితులకు న్యాయం చేయడానికి రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిని ప్రశ్నించారే తప్ప ఎలాంటి నేరానికి పాల్పడలేదని తెలిపారు.
రియల్ ఎస్టేట్ సంస్థ ఏజెంట్లకు, బాధితులకు మధ్య జరిగిన సమావేశంలో తోపులాట చోటుచేసుకుందే తప్ప ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఫిర్యాదుదారు, రియల్ఎస్టేట్ సంస్థ ఉద్యోగి అయిన గ్యార ఉపేందర్కు నోటీసులు జారీచేసింది. వైఖరి తెలియజేయాలని పోలీసులు సూచించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.