K Lakshman: న్యాయ సమస్యలు రాకుండా కులగణన
ABN , Publish Date - May 11 , 2025 | 05:21 AM
కేంద్రంలో గత 64 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కులగణనను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం న్యాయ సమస్యలు రాకుండా కులగణనను చేపట్టనుండడం కీలకమైన చర్య అని రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ అన్నారు.

పూర్తయితే బీసీలకు ప్రయోజనం
బీసీల హక్కులను కాలరాసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు
రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్
బేగంపేట, మే 10 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలో గత 64 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కులగణనను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం న్యాయ సమస్యలు రాకుండా కులగణనను చేపట్టనుండడం కీలకమైన చర్య అని రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ అన్నారు. బేగంపేటలో ‘బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్’(బీసీసీఈ) ఆధ్వర్యంలో ‘‘కులగణన, ఓబీసీల భవిష్యత్ నిర్మాణం, సామాజిక న్యాయం’’అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. 1931 అనంతరం దేశంలో కులగణన జరగలేదన్నారు. 1951లో జరగాల్సిన కులగణనని అప్పటి ప్రధాని నెహ్రూ అడ్డుకున్నారని విమర్శించారు. ఇలా బీసీల హక్కుల ను అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు.
రాష్ట్రంలో 12 శాతం ఉన్న ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి బీసీల హక్కులను తెలంగాణ కాంగ్రెస్ ప్రభు త్వం కాలరాసిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లింలకు తాము వ్యతిరేకం కాదన్నారు. బీసీల కోసం కులగణన అవసరమని నొక్కి చెబుతూ వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ నేతలు, నిపుణుల సలహాలు, సూచనలతో నివేదికను తయారుచేసి కేంద్రంలోని సామాజిక, న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించనున్నట్లు తెలిపారు. యూపీ మంత్రి నరేంద్ర కశ్యప్ మాట్లాడుతూ.. కేంద్రం దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తుందన్నారు. పహల్గామ్లో చనిపోయిన 26 మందితో పాటు యుద్ధంలో మరణించిన జవాన్లకు నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. కులగణనకు ముందుకు వచ్చిన మోదీకి వాడవాడలా పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్(బీసీసీఈ) డైరెక్టర్ వీరేందర్గౌడ్, మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నరహరితో పాటు పలు బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు, నిపుణులు పాల్గొన్నారు.