Share News

Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:58 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

  • 78 వేల మంది రాక.. నిత్యాదాయం రూ.80.11 లక్షలు

  • భక్తులకు ప్రసాద వితరణకు ఈవో రూ.3 లక్షల విరాళం..

  • సర్వీసులో ఉన్నంతకాలం నెలకు లక్ష అందజేస్తానని వెల్లడి

యాదగిరిగుట్ట, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక దర్శనాలకు 2 గంటలు, ధర్మ దర్శనాలకు 4 గంటల సమయం పట్టింది. ఇక సుప్రభాత సేవతో స్వామి అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు సంప్రదాయ రీతిలో నిత్య పూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా చేపట్టారు.


సుమారు 78వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి తరలివచ్చారని.. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.80,11,461ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎస్‌.వెంకట్రావు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, భక్తులకు ఉచిత ప్రసాద వితరణ నిమిత్తం ఈవో వెంకట్రావు దంపతులు రూ.3లక్షల చెక్కును ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయని నరసింహమూర్తి, డీఈవో భాస్కరశర్మకు అందజేశారు. తాను సర్వీసులో ఉన్నంతకాలం ప్రసాద వితరణకు ప్రతి నెలా రూ.లక్ష చెల్లిస్తానని ఈవో తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 04:58 AM