Share News

CPI : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వదిలేయాలి

ABN , Publish Date - Jun 12 , 2025 | 03:36 AM

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాకుండా అందులోని అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను ఇక వదిలేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

CPI : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వదిలేయాలి

  • కేసీఆర్‌ వందల కార్లలో విచారణకు హాజరు కావడం ప్రజాస్వామ్యం కాదు.. గుంపుస్వామ్యం: కూనంనేని

పాలమూరు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాకుండా అందులోని అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను ఇక వదిలేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఈ మూడు బ్యారేజీల నుంచి నీరు రావడం లేదని, ఎల్లంపల్లి నుంచి వస్తోందని చెప్పారు. కాళేశ్వరంలో జరిగిన తప్పులపై త్వరితగతిన విచారణ చేయాలని కోరారు. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్లకు సంవత్సరానికి రూ.10 వేల కోట్ల కరెంటు ఖర్చు అవుతుందని, దీనికి కోసం చేసిన అప్పుల వడ్డీ కూడా తీర్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మూడు బ్యారేజీలను రద్దు చేస్తే కరెంటు ఖర్చు తగ్గుతుందన్నారు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.


చాలామంది ముఖ్యమంత్రులు, ప్రధానులు విచారణలను ఎదుర్కొన్నారని, కానీ కాళేశ్వరం విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్‌ వందల కార్లతో వెళ్లారని, ఇది ప్రజాస్వామ్యం కాదని, గుంపు స్వామ్యమని విమర్శించారు. ఎవరికి గుంపు ఉంటే వారిదే రాజ్యం అన్నట్లు ఉందని, అలాంటి చర్యలకు ప్రభుత్వం ఎలా అనుమతించిందని ప్రశ్నించారు. కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే అని చెప్పేవారని, ఇప్పుడు తాను ఏమైనా ఇంజనీర్‌నా అని అంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ గురించి విచారణ జరగడం విచిత్రమని, విచారణలో హరీశ్‌, ఈటల తమకేమీ సంబంధం లేదన్నారని, ఇప్పుడు కేసీఆర్‌ కూడా అలానే అంటున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పని వారు చేయాలని, అలా చేయనందునే సమస్యలు వచ్చాయన్నారు. నిర్ణీత గడువులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని కోరారు.

Updated Date - Jun 12 , 2025 | 03:36 AM