Medipally Satyam: కేటీఆర్.. వీపు సాపు చేస్తరు జాగ్రత్త!
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:21 AM
కేటీఆర్ భాషను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. అమెరికాలో చదివి, ఉద్యోగం చేసి వచ్చిన కేటీఆర్ భాష విని వీధి రౌడీలు సైతం సిగ్గుపడతారన్నారు.

ఇప్పటికైనా భాష మార్చుకో: మేడిపల్లి
సీఎంపై చిల్లర వ్యాఖ్యలు సహించబోం: కాల్వ సుజాత
బీసీలను మోసం చేస్తున్న ఆర్.కృష్ణయ్య: ఈరవత్రి
హైదరాబాద్/న్యూఢిల్లీ, జూన్ 11(ఆంధ్రజ్యోతి): కేటీఆర్ భాషను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. అమెరికాలో చదివి, ఉద్యోగం చేసి వచ్చిన కేటీఆర్ భాష విని వీధి రౌడీలు సైతం సిగ్గుపడతారన్నారు. ఇప్పటికైనా భాష మార్చుకోని పక్షంలో తెలంగాణ ప్రజలు వీపు సాపు చేస్తరు.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కేటీఆర్ అచ్చోసిన ఆంబోతులా రంకెలువేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో తూలనాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పు చేసినందునే కాళేశ్వరం కమిషన్ ఆయనను విచారణకు పిలిచిందన్నారు. తమ అవినీతి బయటపడుతుందనే బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్పై చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ఇక సహించబోమంటూ కేటీఆర్నుద్దేశించి టీపీసీసీ అధికార ప్రతినిధి, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్సర్సన్ కాల్వ సుజాత హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే కేంద్రంలో బీజేపీ కులగణన చేస్తోందని ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. 40 ఏళ్లుగా పోరాడిన ఆర్.కృష్ణయ్య.. బీజేపీలో ఉంటూ బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సహకార ఉద్యమంలో యువతకు భాగస్వామ్యం కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్లోని నిజాం కళాశాల నుంచి 120 మంది డిగ్రీ విద్యార్థులను ఎంపిక చేశామన్నారు.
కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు: చామల
కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరు కావడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, పిచ్చికుక్కలా రోడ్డుపై మొరుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు భయం లేకుంటే వన్ టు వన్ విచారణ ఎందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు అందరూ ఓపెన్ కోర్టులో సమాధానాలు ఇస్తుంటే, కేసీఆర్ మాత్రం ఎవరూ లేకుండా మాట్లాడతానని ఎందుకన్నారో చెప్పాలన్నారు.