Congress: ఓరుగల్లుపై కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:23 AM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంపైఆ పార్టీ ముఖ్య నేతలు గాంధీభవన్లో సమావేశమయ్యారు. ఆదివారం ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో..

స్థానిక ఎన్నికల వ్యూహాలపైనా చర్చ
ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి అధ్యక్షతన సమావేశం
హాజరైన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
హైదరాబాద్/హనుమకొండ సిటీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంపైఆ పార్టీ ముఖ్య నేతలు గాంధీభవన్లో సమావేశమయ్యారు. ఆదివారం ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు. భేటీ అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
ఆయా అంశాలపైన వరంగల్ జిల్లా నేతల అభిప్రాయ సేకరణ జరిగిందన్నారు. నేతల మధ్య భేదాభిప్రాయాలు, క్రమశిక్షణ చర్యల వంటి వాటిపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ సర్వోదయ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-స్వదేశీ మేళా గాంధీభవన్లో జరిగింది. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహాలు, చరఖాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క, డిప్యూటీ స్పీకర్ రాంచందర్ నాయక్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, గిరిజన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్ తదితరులు ప్రదర్శనను తిలకించారు. మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించారు.