Mahesh Kumar Goud: ఆరడుగులు పెరిగాడే కానీ.. అరంగుళమైనా మెదడు పెంచుకోలేదు
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:35 AM
ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో జరిగిన ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశంలో ఏయే అంశాలపై మాట్లాడింది.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించినా.. సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పినా బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మెదడుకు ఎక్కలేదు.

హరీశ్ వాదనలో పస లేదు: మహే్షకుమార్గౌడ్
హైదరాబాద్, జూలై 17(ఆంధ్రజ్యోతి): ‘‘ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో జరిగిన ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశంలో ఏయే అంశాలపై మాట్లాడింది.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించినా.. సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పినా బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మెదడుకు ఎక్కలేదు. ఆయన ఆరడుగులు పెరిగాడే కానీ.. మెదడును అరంగుళం కూడా పెంచుకోలేదు. అడ్డగోలు వాదనలు, అర్థంలేని తర్కం చేస్తూ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నడు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడగానే.. ఏదో ఒకటి మాట్లాడి ఉనికి చాటుకోవాలనే తపనే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయనకు పట్టింపు లేదు’’ అంటూ టీపీసీసీ చీఫ్ మహే్షగౌడ్ ధ్వజమెత్తారు. హరీశ్ వాదనల్లో పసే లేదని గురువారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చిద్దాం రండి అంటూ సీఎం రేవంత్రెడ్డి.. కేసీఆర్కు సవాల్ విసిరితే అటునుంచి స్పందన ఏదని ప్రశ్నించారు.
ప్రెస్మీట్లు పెట్టి కోడిగుడ్డుపై ఈకలు పీకాలని చూస్తే ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. కాగా, పీసీసీ మాజీ చీఫ్ ఎం. సత్యనారాయణరావు సతీమణి సుగుణ మృతి పట్ల మహే్షకుమార్గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు.కాగా, పదేళ్ల పాలనలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దోచుకున్న డబ్బంతా కక్కాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన గాంధీభవన్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపైన వినతిపత్రాలు స్వీకరించారు. మరోవైపు, మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో తాము బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, బీఆర్ఎస్ దాన్ని 22 శాతానికి కుదించిందని ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటున్నట్లు తెలిపారు. తన వల్లే బీసీ రిజర్వేషన్లు వచ్చాయంటున్న లిక్కర్ రాణి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి