Congress: కేటీఆర్ అవినీతి బయటపెడ్తాం
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:50 AM
కేటీఆర్ అవినీతి, అక్రమాలను బయటకు తీస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. త్వరలో అంబులెన్స్ల స్కాం వెలుగులోకి రాబోతోందని చెప్పారు.

సీఎం రేవంత్కు బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు: బల్మూరి
కేటీఆర్ది అవినీతి డబ్బు బలుపు: నాయిని
అలా మాట్లాడితే నాలుక కోస్తా: రమేశ్రెడ్డి
చెంప దెబ్బలు ఖాయం: చనగాని
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్ అవినీతి, అక్రమాలను బయటకు తీస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. త్వరలో అంబులెన్స్ల స్కాం వెలుగులోకి రాబోతోందని చెప్పారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో బల్మూరి మీడియాతో మాట్లాడారు. సీఎం కుర్చీని గౌరవించాలంటూ గతంలో సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడిన కేటీఆర్ నేడు ఆ సంస్కారాన్ని వదిలివేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్కు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని హెచ్చరించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్తో పాటు ఎక్స్లో అడ్డగోలుగా పోస్టు పెట్టిన కౌశిక్రెడ్డిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. అక్రమంగా సంపాదించిన అవినీతి డబ్బు బలుపుతో కేటీఆర్ మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ను తిట్టాలంటే సంస్కారం అడ్డు వస్తోందన్నారు. ఏ శాఖను వదిలిపెట్టకుండా కల్వకుంట్ల కుటుంబం అడ్డదిడ్డంగా దోచుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమని ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సిగ్గు లేకుండా కేసీఆర్ వెంట తిరుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని చూసి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. ఏనాటికైనా కల్వకుంట్ల కుటుంబం ఊచలు లెక్క పెట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్పై అవాకులు చెవాకులు పేలితే నాలుకలు కోస్తామని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి హెచ్చరించారు. అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్ వీధి రౌడీల కన్నా హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గాంధీభవన్లో రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డితో కలిసి రమేశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ పద్ధతి మార్చుకోని పక్షంలో ప్రజలే తిరగబడతారన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ దింపుడు కల్లం ఆశలు పెట్టుకుందని.. ఆ ఎన్నికల్లోనూ ప్రజలు గులాబీ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మొట్టు సాయికుమార్ హెచ్చరించారు. కేటీఆర్ రేవంత్ కాలి గోటికి కూడా సరితూగరని.. చిల్లర గాళ్లను వెంటేసుకుని చిల్లర మాటలు మాట్లాడితే గొప్పోళ్లు కారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు రోజు రోజుకు హద్దు మీరుతున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. సీఎంపై చిల్లర వ్యాఖ్యలు చేస్తే చెంప దెబ్బలు ఖాయమన్నారు. కేటీఆర్ వ్యవహారం చూస్తే ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ కావాలనే చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్ తీరు మారకపోతే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి చెంపదెబ్బలు తప్పవని హెచ్చరించారు.