Minister Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డులు..14 నుంచి పంపిణీ
ABN , Publish Date - Jul 03 , 2025 | 03:32 AM
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈ నెల 14న జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను అతి త్వరలో ప్రారంభిస్తాం: ఉత్తమ్
ఎరువుల కొరత రానీయొద్దు: అడ్లూరి
జిల్లా కేంద్రాలకు డబుల్రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్లగొండ, మహేశ్వరం, జూలై 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈ నెల 14న జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ఈ తరుణంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ నెల 13లోపు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అర్హుల జాబితాలు రూపొందించాలని ఆదేశించారు. బుధవారం నల్లగొండలో జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగ సభలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభిస్తారని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం వద్ద హెలికాప్టర్ ద్వారా ఎలకో్ట్ర మ్యాగ్నటిక్ రాడార్ సర్వే నిర్వహించి, నివేదిక ఆధారంగా టన్నెల్ పనులు అతిత్వరలో పునఃప్రారంభిస్తామని వెల్లడించారు. టన్నెల్స్ నిర్మాణానికి అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ హర్ఫాల్ సింగ్ను నీటిపారుదల శాఖ గౌరవ సలహాదారుగా, ప్రపంచ టన్నెల్ నిపుణుడు జనరల్ పరీక్షిత్ బెహరాను ఇరిగేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించబోతున్నట్లు చెప్పారు.
వారి నేతృత్వంలో ఎస్ఎల్బీసీ సొరంగమార్గాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. వానాకాలం సీజన్ ఆరంభమైన నేపథ్యంలో రైతులకు ఎరువుల ఇబ్బందుల్లేకుండా చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉన్న రోడ్లను రూ.12 వేల కోట్లతో డబుల్ లైన్ రోడ్లుగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వీటన్నింటినీ హామ్ పద్ధతిలో చేపడతారని, పంచాయతీరాజ్ రోడ్లను సైతం ఇదేరీతిలో చేపడుతున్నామన్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ పరిశ్రమను గురువారం సీఎం రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించనున్నారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో 2 వేల మందికి పైగానే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి