Share News

Bandaru Dattatreya: స్కూలు బీజేపీ.. కాలేజీ టీడీపీ.. ఉద్యోగం రాహుల్‌ దగ్గర

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:18 AM

రాజకీయాలకతీతంగా కిషన్‌రెడ్డిని అప్పుడప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటానన్న ఆయన.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు.

Bandaru Dattatreya: స్కూలు బీజేపీ.. కాలేజీ టీడీపీ.. ఉద్యోగం రాహుల్‌ దగ్గర

నేనూ, కిషన్‌రెడ్డి కలిస్తే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంది

దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో సన్నిహిత బంధాలు

మా ప్రభుత్వ నిర్ణయాల్లో దత్తన్న, పీజేఆర్‌ స్ఫూర్తి

ప్రస్తుతం జంట నగరాల్లో ఇలాంటి నేతల కొరత ఉంది

దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌

నేనీ స్థాయిలో ఉండడానికి దత్తాత్రేయే కారణం: కిషన్‌రెడ్డి

డైపర్లు మార్చినట్లు పార్టీలు మార్చేస్తున్నారు: వెంకయ్య

జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపం దత్తాత్రేయ: చంద్రబాబు

బాబు వల్లే హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌: కోమటిరెడ్డి

బీజేపీ కార్యకర్తలే నా ఆస్తి: బండారు దత్తాత్రేయ

వారికి చెవులున్నా వినపడవు.. నోరున్నా మాట్లాడరు

కిషన్‌రెడ్డిపై రాజాసింగ్‌ పరోక్ష విమర్శలు

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, తాను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయాలకతీతంగా కిషన్‌రెడ్డిని అప్పుడప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటానన్న ఆయన.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా జరిగిన సరదా సంఘటనను రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ‘‘నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబును చూపిస్తూ, ఇదిగో మీ సహచర సీఎం ఇక్కడ ఉన్నారు అని సరదాగా అన్నారు. అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్లి.. ‘నా స్కూలు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో; ఇప్పుడు రాహుల్‌ దగ్గర ఉద్యోగం చేస్తున్నా’ అని నవ్వుతూ చెప్పా’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. జాతీయ రాజకీయాల్లో దివంగత నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి ఉన్న గౌరవం, రాష్ట్రస్థాయిలో బండారు దత్తాత్రేయకు ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో దత్తాత్రేయ, పీజేఆర్‌ల స్ఫూర్తి ఉంటుందని తెలిపారు. అలయ్‌బలయ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం శిల్పకళా వేదికలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. దత్తాత్రేయ కుటుంబంతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. దత్తాత్రేయతో పాటు దివంగత కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌లు జంట నగరాల పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. పేదలు పాన్‌ డబ్బా పెట్టుకుంటే దాన్ని ప్రారంభించేందుకు కూడా దత్తాత్రేయ అందుబాటులో ఉండేవారని, జంట నగరాల్లో ఇలాంటి నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఇక్కడే పెట్టుకోవచ్చు అన్నట్లుగా మంత్రులంతా దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణకు హాజరయ్యారని రేవంత్‌ సరదాగా వ్యాఖ్యానించారు. అలయ్‌బలయ్‌ కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అజాతశత్రువు అనే పదం దత్తాత్రేయకు వందశాతం సరిపోతుందని రేవంత్‌ అన్నారు. కోవింద్‌ మాట్లాడుతూ.. దత్తాత్రేయ ప్రతి ఒక్కరికీ మిత్రుడన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మంది శ్రామికులకు ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. యూపీ తనకు పుట్టినిల్లు అయితే, తెలుగు రాష్ట్రాలు రెండో ఇల్లు అని కోవింద్‌ చెప్పారు. దత్తాత్రేయ డిక్షనరీలో శత్రువు, ప్రత్యర్థి అన్న పదాలు ఉండవేమోనని వ్యాఖ్యానించారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు.

జెంటిల్మెన్‌కు ప్రతిరూపం దత్తాత్రేయ: బాబు

జెంటిల్మెన్‌కు ప్రతిరూపం దత్తాత్రేయ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. దత్తాత్రేయ అని పిలిచేవారికంటే, అభిమానంతో దత్తన్న అని పిలిచేవారే ఎక్కువ ఉంటారని తెలిపారు. ఆయనది పేరుకు హిందుత్వం.. మతం భారతీయం అని అన్నారు. తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై దత్తాత్రేయ ఎన్నో లేఖలు రాశారని, ఆయన లేఖలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో దత్తాత్రేయ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. హైటెక్‌సిటీ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆయన వల్లే హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగిందని తెలిపారు.


డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారు

చిన్నపిల్లలకు డైపర్లు మార్చినట్లుగా ప్రస్తుత నాయకులు పదవుల కోసం పార్టీలు మార్చేస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. పిల్లలకు ఉదయం, సాయంత్రం డైపర్లు ఎందుకు మారుస్తారో అందరికీ తెలుసన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఎంత ముఖ్యమో.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. బూతులు మాట్లాడేవారిని, పైశాచిక ఆనందం పొందే నాయకులను ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు ఓడించి బుద్ధి చెప్పారని వెంకయ్య గుర్తుచేశారు. ఆరెస్సెస్‌ గురించి కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సమాజ శ్రేయస్సునే ఊపిరిగా సంఘ్‌ తమకు బోధించిందని తెలిపారు. వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ స్థాయిలో ఉండడానికి దత్తాత్రేయే కారణమని చెప్పారు. సిద్ధాంతాలు వేరైనా ఆయన, ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని తెలిపారు. త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలో ఉన్నప్పుడు తామిద్దరం కలిసే పనిచేశామన్నారు. ఒడిసా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. దత్తాత్రేయ పేరు వినగానే ఆయన భుజంపై వేసుకునే కండువా, అలయ్‌బలయ్‌ గుర్తుకు వస్తాయన్నారు. ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. దత్తాత్రేయకు ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ధైర్యంగా మళ్లీ పోటీ చేసి గెలిచారన్నారు. యువతరానికి దత్తాత్రేయ రచించిన పుస్తకం స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. ఏ పదవిలో ఉన్నా దత్తాత్రేయ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడన్నారు.

కార్యకర్తలే నా ఆస్తి: దత్తాత్రేయ

బీజేపీ కార్యకర్తలే తన ఆస్తి అని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. వారి కృషి వల్లే తాను ఈ స్థాయికి ఎదిగినట్లు చెప్పారు. కార్యకర్తలతో పాటు తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన సతీమణి వసంతకు ఎంతో రుణపడి ఉంటానన్నారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయ నాయకుల లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. ఆరెస్సెసే తన సర్వస్వం అని.. అసలు రాజకీయాల్లోకి వస్తానని తాను అనుకోలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 05:15 AM