Share News

CM Revanth Reddy: కఠినంగా కనిపించినా.. అభిమానమే!

ABN , Publish Date - Jun 15 , 2025 | 03:22 AM

రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ, మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటునందిస్తుంది.

CM Revanth Reddy: కఠినంగా కనిపించినా.. అభిమానమే!

  • సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తాం

  • ప్రభుత్వపరంగా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు

  • కానీ, మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటాం

  • ‘తెలంగాణ రైజింగ్‌-2047’ డాక్యుమెంట్‌లో.. ఒక చాప్టర్‌ సినీ పరిశ్రమకు కేటాయిస్తాం

  • దానికి తగ్గట్లుగా ప్రణాళికను రచించండి

  • హాలీవుడ్‌, బాలీవుడ్‌ హైదరాబాద్‌కు రావాల్సిందే..

  • రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి

  • ఇంకా 22 ఏళ్లు క్రియాశీల రాజకీయాల్లో ఉంటా

  • గద్దరన్న అంటే ఒక చైతన్యం.. ఒక విప్లవం

  • గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ, మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటునందిస్తుంది. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అభినందించడానికి, మీకు సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సినీ ప్రముఖులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని సాధించాలన్న లక్ష్యంతో రూపొందిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ డాక్యుమెంట్‌లో ఒక చాప్టర్‌ను సినీ పరిశ్రమకు కేటాయిస్తున్నామని తెలిపారు. దానికి తగినట్లుగా చాప్టర్‌ను రచించాలని సినీ ప్రముఖులకు సూచించారు. శనివారం రాత్రి హైటెక్స్‌లో జరిగిన ‘తెలంగాణ గద్దర్‌ ఫిలిం అవార్డుల’ ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘సుమారు 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిని నిర్వహించాలని సినీ ప్రముఖులు, దిల్‌రాజు వంటివారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, సినీ ప్రముఖులకు నా అభినందనలు. కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి, మీకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా, మిమ్మల్ని అభినందించాలన్న ఆలోచనతో ఈ అవార్డులను మళ్లీ పునఃప్రారంభించింది’’ అని రేవంత్‌ వివరించారు.


ఆ సంప్రదాయాన్ని కొనసాగించేందుకే..

తెలుగు సినీ పరిశ్రమను గుర్తించడానికి, డైరెక్టర్లను, నటులను, ఇతర కళాకారులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని, ఆ అవార్డులకు నంది పేరు పెట్టాలని 60 ఏళ్ల క్రితం 1964లో ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. ఆ సంప్రదాయాన్ని 14 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు కొనసాగిస్తూ వచ్చారని తెలిపారు. మొట్టమొదటి నంది ఉత్తమ నటుడి అవార్డును అక్కినేని నాగేశ్వరరావు తీసుకున్నారని, అలాంటి గొప్ప కళాకారుడికి ఆనాటి ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇవ్వడాన్ని అందరం గుర్తు చేసుకోవాలని అన్నారు. వివిధ కారణాల వల్ల 14 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగించాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం నంది అవార్డులను ‘తెలంగాణ గద్దర్‌ ఫిలిం అవార్డులు’గా ఇస్తోందని పేర్కొన్నారు.. ప్రముఖులంతా ఇక్కడ ఉండి, పరిశ్రమంతా ఒక్కటేనని, పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఆహ్వానిస్తున్నామంటూ సమయాన్ని కేటాయించడాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్‌ అని చర్చించుకునేవారని, తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని మాట్లాడుకునేవారనిఅన్నారు. కానీ, ఈనాడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అంటున్నారని తెలిపారు. ‘‘తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ వేదిక అని మీరు నిరూపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నా. సినీ పరిశ్రమకు సంబంధించి మొదటి తరమంటే అన్న నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. రెండో తరమంటే కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు. మూడో తరమంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున. ఈ రోజు నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉంది. నాలుగో తరంలో పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌.. ఇలా వీరి తరం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తోంది. విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్నవారు సినీ పరిశ్రమలో రాణిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బన్నీ, వెంకట్‌, అశ్వనీదత్‌ అమ్మాయిలు, అల్లుడు నాగ్‌ అశ్విన్‌.. వీళ్లందరూ కాలేజ్‌ డేస్‌లో నాకు తెలుసు. వారందరూ రాణిస్తుండడం పట్ల అభినందిస్తున్నాను’’ అని రేవంత్‌ అన్నారు.

1 copy.jpg


మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటాం..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఇతర రంగాల్లాగే సినీ ఇండస్ట్రీ కూడా గొప్ప పరిశ్రమగా రాణించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో.. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చెందేలా నడిపిస్తానని ప్రధానమంత్రి మోదీకి చెప్పానన్నారు. అది జరగాలంటే సినీ పరిశ్రమ కూడా గొప్పగా అభివృద్ధి చెందాలన్నారు. ‘‘హాలీవుడ్‌ అంటే అమెరికాకు, బాలీవుడ్‌ అంటే ముంబైకి వెళుతున్నాం. నేను దర్శకుడు రాజమౌళిని అడుగుతున్నా. ప్రపంచమే గుర్తించేలా అద్భుతమైన సినిమాలు తీయగలిగిన మీరు.. ఆ పరిశ్రమను ఈ గడ్డ మీదకు ఎందుకు తీసుకురావడం లేదు? హాలీవుడ్‌, బాలీవుడ్‌ హైదరాబాద్‌ గడ్డ మీద ఉండాలి. మీకు ఏం కావాలో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఐటీ, ఫార్మా, డిఫెన్స్‌ పరిశ్రమలను ప్రోత్సహించినట్లే సినీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తాం. ప్రణాళికను మీరు రచించండి. మా ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్‌ ఇస్తాం. ఆ చాప్టర్‌ను రాయాల్సిన బాధ్యత ఇక్కడున్న సినీ పెద్దలందరిపై ఉంటుంది. మీకు ఏం కావాలో నాకు చెప్పండి. ఇక్కడి నుంచి 22 ఏళ్ల సమయం ఉంది. ఈ 22 ఏళ్లు క్రియాశీల రాజకీయాల్లో నేనుంటా. ఏహోదాలో ఉన్నా... మీకు అండగా నిలబడతా’’ అని సీఎం హామీ ఇచ్చారు.


తెలంగాణలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు..

తెలంగాణకు ఎవరైనా రావొచ్చునని, వ్యాపారం చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నారు. ప్రపంచంలోని ఫార్చూన్‌ 500 కంపెనీల్లో 85 కంపెనీల ఫుట్‌ఫాల్స్‌ తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. దేశంలోని ఏ నగరంలోనూ ఈ స్థాయిలో లేవన్నారు.‘‘ బెంగళూరు, అమరావతి, ముంబై, చెన్నై, ఢిల్లీ మెట్రోపాలిటన్‌ సిటీలంటూ మాట్లాడుతుంటారు. వీళ్లెవరూ మాకు పోటీ కాదు. వీళ్లంతా మాకు సోదరులు. న్యూయార్క్‌, టోక్యో, జపాన్‌, దక్షిణ కొరియా, చైనాతో మా పోటీ. పరిశ్రమల విషయంలో చైనాతో, అభివృద్ధిలో దక్షిణ కొరియాతో, టెక్నాలజీలో జపాన్‌తో పోటీ పడదలచుకున్నాం. ఇదీ మా విజన్‌, విజన్‌ డాక్యుమెంట్‌’’ అని రేవంత్‌ వివరించారు. 2047లో ఆగస్టు 15న మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని చూసిన తర్వాత ఆ రోజు చాలా ఆనందంగా ఉంటానని తెలిపారు. అదే రోజు సినీ పరిశ్రమ కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ‘‘నేను చెప్పింది ఏదీ ఇంతవరకు మిస్‌ కాలేదు. నేను సాధించుకోవాలనుకున్న దానిలో ఎందులోనూ ఫెయిల్‌ కాలేదు. సక్సెస్‌ రేట్‌ హండ్రెడ్‌ పర్సంట్‌’’ అని వ్యాఖ్యానించారు.


గద్దర్‌ అన్న అంటేనే విప్లవం

‘‘గద్దరన్న అంటే ఒక చైతన్యం. గద్దరన్న అంటే ఒక విప్లవం. గద్దరన్న ఒక వేగుచుక్క. గద్దరన్న స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జయహే, జయహే గీతాన్ని అందించిన అందెశ్రీ, జై బోలో తెలంగాణ గీతాన్ని అందించిన గద్దరన్న అంటే మాకందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే మేము పోరాటం చేశాం. ఈ పోరాటం ప్రజల కోసమే. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించడానికి నిత్యం వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. తెలంగాణ గద్దర్‌ అవార్డులు తీసుకున్నవారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. తెలంగాణ నిర్మాణంలో, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, గతంలో ఏవైనా అంశాలున్నా వాటన్నింటినీ పక్కన పెట్టి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘నందమూరి బాలకృష్ణ నాకు ఒక మాట చెప్పారు. కళ్లతో చూసేది కళ. కళ్లతో అభినయించేది కళ. కళ్లు మూసుకుని కనేది కల. కళ్లు మూసుకున్న వారిని చైతన్యపరిచేది కళ అని చెప్పమన్నారు. బాలకృష్ణ తరపున మీకందరికీ చెబుతున్నా. ఈ కళా చైతన్యమే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలి. విప్లవాల వైపు నడిపించిన గద్దరన్న స్ఫూర్తి అభివృద్ధి పథం వైపు నడిపించాలి. గద్దరన్న కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గద్దరన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది’’ అని సీఎం ప్రకటించారు. గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌.. ఓల్డ్‌ సిటీ నుంచి ఆస్కార్‌ అవార్డు వరకు రాణించారని, ఆయనకు ఏదైనా ఇవ్వాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఏదైనా అవార్డు ఇవ్వడానికి ఏదైనా నిర్ణయం తీసుకోండని సూచించారు.


గద్దర్‌ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన గద్దర్‌ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు మంజూరు చేసింది. గద్దర్‌ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్‌ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. ఇక ముందు గద్దర్‌ జయంతి వేడుకల నిర్వహణలోనూ గద్దర్‌ ఫౌండేషన్‌కు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 05:26 AM