CM Revanth Reddy: ఉద్యోగులకు ఏం చేద్దాం!
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:31 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేవనెత్తిన పలు డిమాండ్లను పరిష్కరించే దిశగా రేవంత్ సర్కారు యోచిస్తోంది. వారి డిమాండ్లపై ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం రేవంత్
మంత్రులతో సీఎం రెవంత్రెడ్డి సమాలోచన
ఉద్యోగుల సమస్యలు, డీఏలపై కీలక చర్చ
రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపుపై పరిశీలన
మరింత పకడ్బందీగా రైతుభరోసా అమలు
సంక్షేమం క్షేత్రస్థాయికి వెళ్లేలా విస్తృత ప్రచారం
యువవికాసం, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ
5న క్యాబినెట్ భేటీ.. అన్నింటిపైనా నిర్ణయం
ఎన్డీఎ్సఏ నివేదికకు ఓకే.. నిర్మాణ సంస్థపై
చర్యలకు సిఫారసు చేయనున్న మంత్రివర్గం
ఫోన్ ట్యాపింగ్.. కవిత అంశంపై భేటీలో చర్చ
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేవనెత్తిన పలు డిమాండ్లను పరిష్కరించే దిశగా రేవంత్ సర్కారు యోచిస్తోంది. వారి డిమాండ్లపై ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, పదవీ విరమణ వయసు పెంపు, సాధారణ బదిలీల అంశాల్లో క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఆదివారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్రెడ్డి.. మంత్రులతో సమావేశమై ఈ మేరకు చర్చించారు. దీంతోపాటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు. ఆ నివేదికలోని అంశాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో భేటీ సందర్భంగా వారు ప్రస్తావించిన డిమాండ్లనూ భట్టివిక్రమార్క.. సీఎంకు, మంత్రులకు వివరించారు. దీనిపై ఈ నెల 5న జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించాలని, సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల అన్ని డిమాండ్లపై ఒక రోడ్మ్యా్పను సిద్ధం చేయాలని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వం రెండు రకాల ఆలోచనలతో ఉన్నట్టు సమాచారం.
మరింత ఆర్థిక భారం పడకుండా..
ఇప్పటికే సర్కారుపై ఆర్థికభారం ఉండడం, దీనికితోడు ఈ ఒక్క ఏడాదే 8వేల మందికి పైగా ఉద్యోగులు రిటైర్ కానుండడంతో.. మరింత భారం పడకుండా ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఏడాదిపాటు పెంచితే మంచిదని కొందరు మంత్రులు సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టడం ప్రభుత్వం మొదటి ఆలోచనగా ఉంది. ఇక రెండోది.. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల డీఏల్లో ఎన్నింటిని ప్రకటించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలనే అంశంపై చర్చించారు. కాగా, సమావేశంలో అన్ని అంశాలపై మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వ పనితీరు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పట్ల ఉన్న అభిప్రాయాలను కొందరు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. రైతుభరోసా పథకం గ్రామాల్లో లక్షల మందికి అమలవుతోందని, అయితే దీనిని మరింత పకడ్బందీగా అమలు చేస్తే రైతుల్లో ప్రభుత్వం పట్ల మరింత సానుకూల స్పందన వస్తుందని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలనే అంశంపైనా సమావేశంలో చర్చించారు. గ్రామ గ్రామానికి ఈ పథకాలను తెలిపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
5న మంత్రివర్గ సమావేశం..
5న మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక అంశాలపై చర్చించాలని మంత్రుల భేటీలో నిర్ణయించారు. గత నెల జిల్లాల్లో పర్యటించిన మంత్రులు.. అధికారులతో నిర్వహించిన సమీక్షలకు సంబంధించి తయారుచేసిన నివేదికలపై ఈ సమావేశంలో చర్చించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు లబ్ధి చేకూరకుండా చూడాలంటూ ఫిర్యాదులూ వచ్చాయని మంత్రులు.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెద్దసంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్ర్కీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తరువాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మరింత లోతుగా విశ్లేషించి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఈ అంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక యాసంగిలో పండిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని ఇతర మంత్రులు అభినందించారు. రాబోయే వానాకాలం నేపథ్యంలో వ్యవసాయం, నీటిపారుదల ప్రాజెక్టులు, తాగునీటి అవసరాలపైనా చర్చించారు. ప్రధానంగా హైదరాబాద్ నగర ట్రాఫిక్, వర్షాల సమయంలో ప్రబలే వ్యాధుల అంశాలనూ ప్రస్తావించారు. వీటన్నింటిపై రోడ్మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘తెలంగాణ రైజింగ్-2047’ను సాధించే దిశగా ముందుకెళ్లాలని, అందుకోసం దానిని ప్రజా ఉద్యమంగా మార్చాలని సమావేశంలో నిర్ణయించినట్టు సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఎన్డీఎ్సఏ నివేదికకు ఆమోదం..
కాళేశ్వరం, దానిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అఽథారిటీ (ఎన్డీఎ్సఏ) ఇచ్చిన రిపోర్టుపై సీఎం, మంత్రుల సమావేశంలో చర్చించారు. ఈ నెల 5న జరగనున్న క్యాబినెట్ భేటీలో ఎన్డీఎ్సఏ నివేదికను ఆమోదించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిర్మాణ సంస్థపై చర్యలకు సిఫారసు చేయాలనే అంశంపైనా చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ అంశంపైనా చర్చించారు. ఇక బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తరఫున నిరసన గళం బలంగా వినిపించాలని కూడా నిర్ణయించినట్టు తెలిసింది. ఏపీ, తెలంగాణ నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర రాజకీయాల్లో ఇది చాలా సున్నితమైన అంశమని అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు ఈ నెల 5న విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఆ తరువాత జరిగే పరిణామాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఇటీవల ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు తీసుకుంటున్న క్రమంలో ఆ అంశంపైనా చర్చించారు. అనంతరం బీఆర్ఎ్సలో పరిణామాలు, కవిత కొత్త కార్యాలయం ప్రారంభంపై మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని మరికొందరు మంత్రులు అన్నట్లు సమాచారం.
సీఎంను కలిసిన మందకృష్ణ
సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిసి ఆయనతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మందకృష్ణకు సీఎం శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్న ఆయన్ను సీఎం అభినందించారు. కాగా, ఉమ్మడి రాష్ట్ర తొలి సీఎం నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు.
రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకొంటున్న సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ నాయకులందరికీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో.. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. మేరకు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గాల ఖరారుపై ఏఐసీసీతో మాట్లాడేందుకు త్వరలో సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..