Minister Sridhar Babu: సీఎం రేవంత్ ముక్కు సూటి మనిషి
ABN , Publish Date - May 07 , 2025 | 04:16 AM
మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడారన్నారు. ప్రభుత్వాన్ని బెదిరించే వ్యాఖ్యల నేపథ్యంలో ఆవేదనతో సీఎం స్పందించారని తెలిపారు.

ఆర్థిక పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు
సర్కార్ను బెదిరిస్తూ ఒకరిద్దరి వ్యాఖ్యలు
ఆ ఆవేదనతోనే సీఎం మాట్లాడారు
ఉద్యోగులు మా మిత్రులే హకరించాలనే కోరాం: శ్రీధర్బాబు
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్రెడ్డి ముక్కుసూటి మనిషి అని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఇది కొంత మందికి ఇబ్బంది కలిగించి ఉండవచ్చేమో కానీ, వాస్తవ పరిస్థితి అదేనని పేర్కొన్నారు. ఒకరిద్దరు ప్రభుత్వాన్ని బెదిరించినట్లుగా వ్యాఖ్యలు చేశారని, ఆ ఆవేదనతోనే సీఎం అలా మాట్లాడారని తెలిపారు. ఉద్యోగులందరూ తమకు మిత్రులేనని, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అందరూ సహకరించాలనే రేవంత్ విజ్ఞప్తి చేశారని చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన చిట్చాట్గా మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్టీసీ ఉద్యోగులు అర్థం చేసుకున్నారని, అందుకే సమ్మె నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని చెప్పారు. కాస్త ఆలస్యమైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఆపే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజల ముందు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెలా మూడో వారంలో జీతాలు ఇచ్చేవారని, అలాంటి వారికి ఉద్యోగులపై ప్రేమ ఉన్నట్లా? అని నిలదీశారు. డబ్బులు ఇవ్వలేకనే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రభుత్వం చేసిన అప్పుల గురించే కేటీఆర్ మాట్లాడుతున్నారని, కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులనూ ప్రభుత్వమే కడుతుందన్న విషయం తెలియదా? అని ధ్వజమెత్తారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. పెహల్గాం దాడికి బాధ్యత వహిస్తూ కేంద్రంలోని బీజేపీ గద్దె దిగాలని తాము డిమాండ్ చేయలేమా? అని ప్రశ్నించారు.
హెలికాప్టర్లో వెళ్తేనే ఖర్చు తక్కువ
ఓ మంత్రి.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కారులో వెళ్లడం కన్నా.. హెలికాప్టర్లో వెళ్తేనే ఖర్చు తక్కువని శ్రీధర్బాబు వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో అద్దెకు తీసుకున్న హెలికాప్టర్కు ఊరికే డబ్బులు కట్టలేక వాడుతున్నామని తెలిపారు. అందాల పోటీలతో హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుందని, దానికి.. ఉద్యోగుల సమస్యలకు సంబంధమేంటని ప్రశ్నించారు. ఐఏఎస్ స్మితపై తమకు కక్ష లేద ని,నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయంలో సమీక్షలు చేస్తే.. అది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మావోయిస్టులతో శాంతి చర్చలు తప్పు కాదని, వారు జనజీవన స్రవంతిలో కలిసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు.