Medak: కూతురికి బాల్య వివాహం.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:50 AM
కూతురికి బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

తండ్రి మృతి, తల్లి పరిస్థితి విషమం
శివ్వంపేట్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): కూతురికి బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతులబోగుడ గ్రామానికి చెందిన పందుల శివకుమార్, శోభ దంపతులు తమ 13 ఏళ్ల కుమార్తెకు ఇటీవల బాల్య వివాహం జరిపించారు. స్థానిక ఐసీడీఎస్ సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు బాలిక తల్లిదండ్రులతో పాటు పెళ్లి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు బాలికల సంరక్షణ కేంద్రానికి పంపించారు.
అక్కడ ఉన్న తమ కూతురును మంగళవారం చూడడానికి వెళ్లిన తల్లిదండ్రులకు అక్కడి అధికారులు బాల్య వివాహం చేయడం నేరమని, 18 సంవత్సరాలు పూర్తయ్యేవరకు బాలికను పంపించబోమని చెప్పినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక తల్లిదండ్రులు పురుగుల మందు తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివకుమార్ బుధవారం మృతిచెందగా, శోభ పరిస్థితి విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు.